kadapa: సీఎం రమేష్ కు హారతినిచ్చి సాగనంపిన ఆడపడుచులు!
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, నేటి నుంచి జడ్పీ కార్యాలయం ఆవరణలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణ దీక్షకు దిగనుండగా, దీక్షా స్థలికి భారీ ర్యాలీగా ఆయన బయలుదేరారు. తన స్వగ్రామం పొట్లదుర్తి నుంచి బయలుదేరిన ఆయనకు ఆడపడుచులు హారతులిచ్చి, తిలకం దిద్ది సాగనంపారు. ఆపై దాదాపు 100 కార్ల కాన్వాయ్, తెలుగుదేశం కార్యకర్తల నినాదాల మధ్య సీఎం రమేష్ కడపకు బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన దీక్ష ప్రారంభం కానుంది. కాగా, కడప స్టీల్ ప్లాంట్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిన్నటి నుంచే దీక్షలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.