ఉత్తర కొరియా అణు పరీక్షల ఎఫెక్ట్.. 1,399 భూకంపాలు!

ఉత్తర కొరియా అణు పరీక్షల ఎఫెక్ట్.. 1,399 భూకంపాలు!

North Korea Nuclear Test Effect 1399 Earthquakes
  • 2017లో జరిగిన చివరి అణు పరీక్ష తర్వాత పెరిగిన భూకంపాలు 
  • అణు విస్ఫోటనాలతో నిద్రాణంగా ఉన్న ఫాల్ట్ జోన్‌లు యాక్టివేట్ 
  • భవిష్యత్తులో 6.4 తీవ్రతతో భూకంపం వచ్చే ప్రమాదం 
  • హెచ్చరిస్తున్న అధ్యయనం
ఉత్తర కొరియా చేపట్టిన భూగర్భ అణు పరీక్షలు తీవ్రమైన, దీర్ఘకాలిక పర్యావసనాలకు దారితీసినట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. 2006 నుంచి 2017 మధ్య పంగ్యే-రి అణు పరీక్ష కేంద్రంలో నిర్వహించిన ఆరు అణు పరీక్షల కారణంగా, గతంలో నిద్రాణంగా ఉన్న భూమి పొరల్లోని ఫాల్ట్‌లు తిరిగి ఉత్తేజితమై, ఏకంగా 1,399 భూకంపాలను ప్రేరేపించి ఉండవచ్చని ఈ పరిశోధన తేల్చింది. ఈ సంచలన వివరాలతో కూడిన అధ్యయనం ప్రతిష్ఠాత్మక ‘సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమైంది.

దక్షిణ కొరియాలోని పూసాన్ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్వాంగ్-హీ కిమ్, చైనాలోని చెంగ్‌డు యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన జియాంగ్‌లి ఫాన్ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధనను చేపట్టింది. ఇందుకోసం చైనా, దక్షిణ కొరియా సీస్మిక్ స్టేషన్ల నుంచి 2008-2025 మధ్య 17 ఏళ్లపాటు సేకరించిన డేటాను విశ్లేషించారు. 'మ్యాచ్డ్-ఫిల్టర్ డిటెక్షన్' అనే ఆధునిక పద్ధతి ద్వారా సాధారణ మానిటరింగ్‌లో గుర్తించలేని అతి చిన్న భూకంపాలను కూడా వీరు కనుగొన్నారు. మొత్తం 1,399 భూకంపాలు నమోదు కాగా, వాటిలో 955 ఎక్కడ సంభవించాయో కచ్చితమైన ప్రదేశాలను నిర్ధారించారు.

అణు పరీక్షలు జరిగిన మంటాప్ పర్వత ప్రాంతం గతంలో భూకంప కార్యకలాపాలు లేని ప్రదేశంగా ఉండేది. 2006-2017 మధ్య ఇక్కడ కేవలం 60 భూకంపాలు మాత్రమే నమోదయ్యాయి. కానీ 2017 సెప్టెంబర్‌లో జరిగిన ఆరో, అత్యంత శక్తివంతమైన అణు పరీక్ష తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ పరీక్ష జరిగిన 20 రోజుల తర్వాత భూకంపాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 1,330కి పైగా భూకంపాలు సంభవించాయి. ఇవన్నీ దాదాపు 24 కిలోమీటర్ల పొడవైన రెండు ఫాల్ట్ జోన్‌ల వెంబడి కేంద్రీకృతమయ్యాయని పరిశోధకులు గుర్తించారు.

సాధారణంగా అణు పరీక్షల తర్వాత భూకంప కార్యకలాపాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా 2017 తర్వాత భూకంపాల సంఖ్య, తీవ్రత రెండూ పెరిగాయి. చాలా వరకు భూకంపాల తీవ్రత 2 కంటే తక్కువగా ఉన్నప్పటికీ, 2023-24 మధ్య కొన్ని 3.0 కంటే ఎక్కువ తీవ్రతతో, గరిష్ఠంగా 3.4 మాగ్నిట్యూడ్‌తో నమోదయ్యాయి. వరుస పేలుళ్ల వల్ల భూమి పైపొర దెబ్బతిని, ఒత్తిడిలో మార్పులు జరిగి, నిద్రాణమైన ఫాల్ట్‌లు క్రియాశీలమయ్యాయని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

ఈ 24 కిలోమీటర్ల ఫాల్ట్ జోన్ పూర్తిగా చురుకైతే, భవిష్యత్తులో 6.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించే ప్రమాదం ఉందని ప్రొఫెసర్ కిమ్ అంచనా వేశారు. ఈ పరిణామం సహజ భూకంపాలు, రహస్య అణు పరీక్షల మధ్య తేడాలను గుర్తించడాన్ని మరింత సంక్లిష్టం చేస్తుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
North Korea
Punggye-ri Nuclear Test Site
Nuclear Test Earthquakes
Kwang-Hee Kim
Seismic Activity Study
Science Journal Research

More Telugu News