పట్నాలో అభ్యర్థుల ఆందోళన.. రణరంగంగా మారిన వీధులు

Patna candidates protest turns streets into battlefield
  • పట్నాలో ఉపాధ్యాయ అభ్యర్థుల నిరసన
  • హింసాత్మకంగా మారిన ఆందోళన
  • నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జ్
  • ఒకే పరీక్ష, నెగెటివ్ మార్కులు రద్దు చేయాలని అభ్యర్థుల డిమాండ్
  • బీపీఎస్‌సీ చైర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత పెరిగిన ఆగ్రహం
  • ఘర్షణలో ఇరువర్గాలకు గాయాలు
  • పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బిహార్ రాజధాని పట్నా అట్టుడికిపోయింది. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) నిర్వహించనున్న ఉపాధ్యాయ నియామక పరీక్షల ప్రక్రియను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, నిరుద్యోగ యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. మంగళవారం సీఎం నివాసం ముట్టడికి బయల్దేరిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఉపాధ్యాయ నియామక పరీక్షను రెండు దశల్లో కాకుండా ఒకే దశలో నిర్వహించాలని, నెగెటివ్ మార్కులను తొలగించాలని, ఉద్యోగాలన్నీ స్థానికులకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు గాంధీ మైదాన్ నుంచి ర్యాలీగా బయల్దేరారు. వారిని డాక్‌బంగ్లా చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మొదట వాటర్ కేనన్లను ప్రయోగించినా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ప్రతిగా ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పరిస్థితి రణరంగంగా మారింది. ఈ ఘర్షణలో విద్యార్థులు, పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి.

మరోవైపు, ఈ నిరసనకు ముందురోజు బీపీఎస్‌సీ చైర్మన్ రాకేశ్‌కుమార్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి. "ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి" అంటూ నిరసనకారులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా ఖండించారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో చైర్మన్ విచారం వ్యక్తం చేసినప్పటికీ యువత శాంతించలేదు.

కొన్ని గంటల పాటు పట్నా వీధులు ఉద్రిక్తంగా మారగా, పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. 32,388 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి బీపీఎస్‌సీ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది.
Advertisement
BPSC
Patna protest
Bihar teacher recruitment
Police lathi charge
Teacher job aspirants
Rakesh Kumar Singh

More Telugu News