బలూచిస్థాన్‌లో పాక్ స్వాతంత్య్ర దినోత్సవానికి నిరసన.. వెలవెలబోయిన వేడుకలు

Balochistan protests Pakistan Independence Day as celebrations lose luster
  • పాక్ స్వాతంత్ర్య వేడుకలకు దూరంగా బలూచిస్థాన్
  • క్వెట్టా సహా పలు ప్రాంతాల్లో దుకాణాలు మూసివేత, నిరసనలు
  • భద్రతా దళాల వేడుకలపై రాకెట్ దాడులు, 8 పేలుళ్లు
  • పాకిస్థాన్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన బలూచ్ నేషనల్ మూవ్‌మెంట్
  • పాక్ తమను ఆక్రమించుకుందని, ఇది చీకటి రోజని బలూచ్ నేతల ఆరోపణ
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 14న బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వేడుకలను బహిష్కరిస్తూ ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా, ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంద్ వాతావరణం నెలకొంది. క్వెట్టాతో పాటు పలు జిల్లాల్లోని వాణిజ్య ప్రాంతాలు, మార్కెట్లలో దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, రోడ్లపై జనసంచారం చాలా తక్కువగా కనిపించింది.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక శిబిరాలు, ఇతర సున్నితమైన ప్రదేశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించి, కదలికలను నిశితంగా పర్యవేక్షించారు. ప్రభుత్వం, సైన్యం ఆధ్వర్యంలో కేవలం ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లోనే నామమాత్రంగా వేడుకలు నిర్వహించారు.

మరోవైపు, పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. క్వెట్టాలోని జర్ఘూన్ కాలనీలో కౌంటర్-టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (సీటీడీ), ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్‌సీ) సిబ్బంది పాల్గొన్న స్వాతంత్ర్య వేడుకలను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు రాకెట్లు, గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో దాదాపు ఎనిమిది పేలుళ్లు సంభవించినట్లు ‘ది బలూచిస్థాన్ పోస్ట్’ తన కథనంలో పేర్కొంది.

పాక్ ఏర్పాటును వ్యతిరేకించిన బలూచ్ నేతలు
ఈ సందర్భంగా బలూచ్ నేషనల్ మూవ్‌మెంట్ (బీఎన్ఎం) చైర్మన్ నసీమ్ బలూచ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్థాన్ ఏర్పాటును ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆగస్టు 14వ తేదీని బలూచిస్థాన్ తన స్వాతంత్య్రాన్ని కోల్పోయిన రోజుగా ఆయన అభివర్ణించారు. బ్రిటిష్ వలసవాద విధానాలు, మత రాజకీయాల కారణంగానే పాకిస్థాన్ ఏర్పడిందని, దీనికోసం ఈ ప్రాంతాల్లో పెద్దగా రాజకీయ ఉద్యమం ఏదీ జరగలేదని ఆయన వాదించారు. దేశ విభజన వల్ల అత్యధికంగా నష్టపోయింది బలూచ్ జాతేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చారిత్రక ఒప్పందాల ప్రకారం ఆగస్టు 11, 1947న బలూచిస్థాన్ స్వాతంత్ర్యం పొందిందని, కానీ మార్చి 27, 1948న పాకిస్థాన్ తమ భూభాగాన్ని బలవంతంగా ఆక్రమించుకుందని నసీమ్ బలూచ్ ఆరోపించారు. పొరుగు దేశాలతో సమానత్వ ప్రాతిపదికన సంబంధాలు నెరపాలనుకున్న తమ ఆశలను పాక్ ఆక్రమణ నాశనం చేసిందని ఆయన విమర్శించారు.
Advertisement
Balochistan
Pakistan Independence Day
Naseem Baloch
Baloch National Movement
Quetta
Balochistan Protest

More Telugu News