ఇరాన్ ప్రతీకార చర్యలు... అమెరికా స్థావరాలపై భీకర దాడులు, హర్మూజ్ మూసివేత

Iran retaliatory actions fierce attacks on US bases and Hormuz closure
  • మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా
  • అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు
  • జోర్డాన్, ఖతార్, ఒమన్‌లోని యూఎస్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు
  • హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ప్రకటన
  • తమపై దాడులు పునరావృతమైతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. తమ దేశ దక్షిణ ప్రాంతాలపై అమెరికా సైన్యం దాడులకు పాల్పడిందని ఆరోపిస్తూ ఇరాన్ తీవ్రంగా స్పందించింది. దీనికి ప్రతీకారంగా జోర్డాన్, ఖతార్, ఒమన్‌ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఆదివారం దాడులు చేసినట్టు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. అంతటితో ఆగకుండా హర్మూజ్ జలసంధిని తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు మూసివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

తమ అధికారిక మీడియా సంస్థ సెపాహ్ న్యూస్ ద్వారా ఐఆర్జీసీ ఈ వివరాలు వెల్లడించింది. తమ దక్షిణ తీరప్రాంతాల్లోని పలు సైనిక స్థావరాలు, కమ్యూనికేషన్ టవర్లపై యూఎస్ వైమానిక దాడులు చేసిందని పేర్కొంది. దీనికి ప్రతీకారంగా మూడు దశల్లో దాడులు చేశామని తెలిపింది. మొదటి దశలో జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుని, అక్కడి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను, ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ల హ్యాంగర్‌ను ధ్వంసం చేశామని వివరించింది.

రెండో దశలో ఖతార్‌లోని అల్ ఉదెయిద్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసి, కమాండ్ సెంటర్‌తో పాటు ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణ కేంద్రాలను ధ్వంసం చేశామని పేర్కొంది. మూడో దశలో ఒమన్‌లోని దుక్మ్ పోర్టులో ఉన్న అమెరికా లాజిస్టికల్ కేంద్రాలపై భారీ దాడి చేశామని తెలిపింది. ఇరాన్ సైన్యం కూడా కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై కమికాజే డ్రోన్లతో దాడులు చేసిందని, రాడార్ సైట్లు, ఆయుధ డిపోలను ధ్వంసం చేసిందని వెల్లడించింది. అమెరికా మళ్లీ దాడులకు పాల్పడితే మరింత తీవ్రమైన ప్రతిచర్యలు ఉంటాయని ఐఆర్జీసీ హెచ్చరించింది. అమెరికా జోక్యం ఆగే వరకు హర్మూజ్ జలసంధి మీదుగా ఏ నౌకనూ అనుమతించబోమని స్పష్టం చేసింది.
Advertisement
Iran
US Military Bases
Strait of Hormuz
Middle East Tensions
IRGC
Drone Attacks

More Telugu News