చైనా మెగా డ్యామ్‌కు సొంత శాస్త్రవేత్తల హెచ్చరిక.. పొంచివున్న పెను ప్రమాదం!

Chinese scientists warn of major danger at China mega dam
  • బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న మెగా డ్యామ్‌కు ముప్పు
  • క్రియాశీలక ఫాల్ట్ లైన్‌పై డ్యామ్ నిర్మాణం జరుగుతోందని వెల్లడి
  • భూకంపాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరిక
  • భారత్, బంగ్లాదేశ్‌పై తీవ్ర ప్రభావం పడుతుందన్న ఆందోళనలు
బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ స్థాయిలో నిర్మిస్తున్న మెగా హైడ్రోపవర్ ప్రాజెక్టు భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతం కింద ఒక క్రియాశీలక ఫాల్ట్ లైన్ (భూపలకల మధ్య పగులు) ఉన్నట్లు చైనాకు చెందిన జియాలజిస్టులే స్వయంగా హెచ్చరించారు. దీనివల్ల ఆ ప్రాంతంలో భూకంపాలు సంభవించే, కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉందని వారి అధ్యయన నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక గత నెలలో ప్రచురితమైంది.

టిబెట్‌లోని యార్లుంగ్ త్సాంగ్పో నదిపై (భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత బ్రహ్మపుత్రగా పిలుస్తారు) ఈ భారీ డ్యామ్ నిర్మాణాన్ని చైనా 2025లో ప్రారంభించింది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుగా నిలవనుంది. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే మూడు రెట్ల అధికంగా, ఏటా సుమారు 300 బిలియన్ కిలోవాట్ గంటల విద్యుత్‌ను ఇది ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు.

చైనా జియోలాజికల్ సర్వే ఆధ్వర్యంలో చెంగ్డూ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు ఈ అధ్యయనం నిర్వహించారు. డ్యామ్ నిర్మిస్తున్న ప్రాంతంలో ‘పైజెన్ ఫాల్ట్’ అనే ఫాల్ట్ లైన్ ఉందని, ఇది నిరంతరం కదులుతూ ఉండటం వల్ల అక్కడి శిలలు బలహీనపడ్డాయని వారు గుర్తించారు. డ్యామ్‌లో నీటిని నింపినప్పుడు లేదా భూకంపం సంభవించినప్పుడు కొండచరియలు విరిగిపడే ముప్పు అధికంగా ఉంటుందని నివేదికలో స్పష్టం చేశారు. హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఈ ప్రాంతం సహజంగానే భూకంపాల ప్రభావానికి ఎక్కువగా గురవుతుందని వారు గుర్తుచేశారు.

ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌కు బ్రహ్మపుత్ర నది ప్రధాన జీవనాధారం. ఈ నదిపై చైనా చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుందని, పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని భారత్ చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజా భౌగోళిక అధ్యయన నివేదిక వెలువడటంతో ఈ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి.
Advertisement
China Mega Dam
Brahmaputra River
Yarlung Tsangpo
Tibet Hydropower Project
Paizhen Fault

More Telugu News