‘ఆస్ట్రేలియాకు మోదీ నిజమైన మిత్రుడు’.. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌

  • మెల్‌బోర్న్‌లో భారతీయుల సభలో ప్రశంసలు
  • భారత్‌తో బంధం మరింత బలపడిందన్న వ్యాఖ్యలు
  • 2023 అహ్మదాబాద్‌ పర్యటనను గుర్తు చేసిన ఆల్బనీస్‌
  • క్లిష్ట పరిస్థితుల్లో ముందు స్పందించేది భారతీయులేనని కితాబు
  • భారతీయుల వల్ల ఆస్ట్రేలియా బలమైన దేశంగా మారిందని వ్యాఖ్య
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ ఆస్ట్రేలియాకు నిజమైన మిత్రుడని, తనకు ఎంతో ఆప్తుడని అన్నారు. మెల్‌బోర్న్‌లో జరిగిన ‘మెల్‌బోర్న్‌ మీట్స్‌ మోదీ’ కార్యక్రమంలో భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మెల్‌బోర్న్‌లోని మార్వెల్‌ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు. ఎన్నో చారిత్రక కార్యక్రమాలకు ఈ స్టేడియం వేదికగా నిలిచిందని, కానీ భారతీయుల ఈ సమావేశం అత్యంత ప్రత్యేకమైందని ఆల్బనీస్‌ అన్నారు. ఈ సభలో కనిపిస్తున్న ఉత్సాహమే భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఉన్న బలమైన బంధానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ప్రధానిగా తాను రెండుసార్లు భారత్‌లో పర్యటించే అవకాశం దక్కిందని ఆల్బనీస్‌ గుర్తు చేసుకున్నారు. భారతదేశ అందాలు, ప్రజల ఆతిథ్యం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. 2023లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మోదీతో కలిసి రథంలో ప్రయాణించిన అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు. అప్పట్లో గుజరాత్‌లో చూసిన ఆప్యాయత, ఇప్పుడు ఈ సభలోనూ కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

భారత సంతతి ప్రజలు ఆస్ట్రేలియా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆల్బనీస్‌ కొనియాడారు. ఆరోగ్యం, ఐటీ వంటి రంగాల్లో తమ సేవలు అందిస్తున్నారని చెప్పారు. చిన్న వ్యాపారాల అభివృద్ధికి తోడ్పడటంతో పాటు విద్యా రంగాన్ని కూడా బలోపేతం చేస్తున్నారని తెలిపారు. క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ముందుగా స్పందించి సాయం చేసేది భారతీయులేనని వెల్లడించారు.

భారతీయుల వల్ల ఆస్ట్రేలియా మరింత బలమైన, వైవిధ్యభరితమైన దేశంగా మారిందని ఆల్బనీస్‌ అన్నారు. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య బంధాన్ని మరింత బలపరిచే సజీవ వారధి భారత సంతతి ప్రజలేనని కొనియాడారు.

Narendra Modi
Anthony Albanese
Melbourne Meets Modi
India Australia Relations
Indian Diaspora Australia
Marvel Stadium

More Telugu News