అది ట్రైలరే.. ఈసారి టార్గెట్ నువ్వే.. రోహిత్ శెట్టికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు
- రూ. 20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆడియో క్లిప్ పంపిన దుండగులు
- డబ్బు ఇవ్వకుంటే ఈసారి నేరుగా టార్గెట్ చేస్తామని హెచ్చరిక
- ఫిబ్రవరిలో జరిగిన కాల్పులు ట్రైలర్ మాత్రమేనని ఆడియోలో పేర్కొన్న గ్యాంగ్
- ఆడియో క్లిప్ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు
పోలీసుల కథనం ప్రకారం.. నిన్న ఉదయం రోహిత్ శెట్టి సిబ్బందికి సుమారు 90 సెకన్ల నిడివి గల ఆడియో క్లిప్ వచ్చింది. అందులో "ఫిబ్రవరిలో మీ ఇంటిపై జరిపిన కాల్పులు కేవలం ట్రైలర్ మాత్రమే. డిమాండ్ చేసిన రూ. 20 కోట్లు ఇవ్వకపోతే ఈసారి బుల్లెట్లు నేరుగా నీకే తగులుతాయి" అని గ్యాంగ్స్టర్లు హెచ్చరించారు. ఈ వాయిస్, లారెన్స్ బిష్ణోయ్ ముఖ్య అనుచరుడిగా భావిస్తున్న శుభం లోంకర్దిగా పోలీసులు అనుమానిస్తున్నారు. 2024లో జరిగిన నేత బాబా సిద్ధిఖీ హత్య కేసుతో పాటు రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల కేసులో కూడా శుభం లోంకర్ నిందితుడిగా ఉన్నాడు.
రోహిత్ శెట్టి సిబ్బంది ఈ ఆడియో క్లిప్ను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు అందజేశారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత పోలీసులు ఆ వాయిస్ను శుభం లోంకర్దిగానే భావిస్తున్నారు. పూర్తి నిర్ధారణ కోసం ఆడియో క్లిప్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జుహూలోని రోహిత్ శెట్టి నివాసం వెలుపల గుర్తుతెలియని వ్యక్తులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడికి తామే బాధ్యులమని లారెన్స్ గ్యాంగ్ ప్రకటించుకుంది. బైక్పై వచ్చి కాల్పులు జరిపిన దీపక్ శర్మ అనే వ్యక్తిని పోలీసులు ఆగ్రాలో అరెస్ట్ చేశారు. ఈ కాల్పుల ఘటనపై ముంబై క్రైం బ్రాంచ్ ఏప్రిల్లో 1,624 పేజీల చార్జిషీట్ను దాఖలు చేసింది. ఇందులో 15 మందిని నిందితులుగా పేర్కొనగా, ప్రవీణ్ లోంకర్, ఆర్జో బిష్ణోయ్లను పరారీలో ఉన్నవారిగా ప్రకటించారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే, అదే గ్యాంగ్ నుంచి మరోసారి బెదిరింపులు రావడం గమనార్హం.