ప్రజలపై పన్నుల భారం.. పెట్రోల్ ధరలపై కేంద్రాన్ని నిలదీసిన ఖర్గే
- అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గినా దేశంలో రేట్లు తగ్గట్లేదన్న ఖర్గే
- ప్రజలను పన్నుల వసూలు వనరులుగా చూస్తున్నారని కేంద్రంపై విమర్శ
- గతంలో కంటే క్రూడ్ ధరలు తగ్గినా ప్రయోజనం లేదని ఆరోపణ
- దేశంలో పలుచోట్ల రూ. 100 దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నేపథ్యంలో ముడి చమురు బ్యారెల్ ధర 138 డాలర్లకు చేరినప్పుడు, దేశంలో లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ. 94.77గా ఉండేదని ఖర్గే గుర్తుచేశారు. ప్రస్తుతం క్రూడ్ ధర 70 నుంచి 82 డాలర్ల మధ్య ఉన్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్ ధర రూ. 101 - 111, డీజిల్ ధర రూ. 95 - 100 మధ్య కొనసాగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు ఎందుకు బదిలీ చేయడం లేదని ప్రశ్నించారు.
బీజేపీ ప్రభుత్వం సామాన్యుల జేబులు ఖాళీ చేస్తూ ప్రజలను దోచుకుంటోందని ఖర్గే ధ్వజమెత్తారు. ప్రజలను కేవలం పన్నుల వసూలు సాధనంగానే కేంద్రం చూస్తోందని మండిపడ్డారు. యుద్ధ వాతావరణాన్ని సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ ధరలను రెట్టింపు చేసిందని, ప్రస్తుతం సరఫరా సాధారణ స్థితికి వచ్చినా ధరలను ఎందుకు తగ్గించడం లేదని ఆయన నిలదీశారు.
భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. గతంలో చమురు ధరలు పెరిగిన సమయంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ధరలు తగ్గినా, గత నష్టాలను పూడ్చుకోవడం, దిగుమతి చేసుకున్న చమురు దేశానికి చేరడానికి పట్టే సమయం, రూపాయి విలువలో హెచ్చుతగ్గులు, అధిక పన్నుల వంటి కారణాల వల్ల దేశీయంగా ధరలు తగ్గడం లేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.