వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్ ఫిక్స్

Venkatesh and Trivikram Adarsha Kutumbam release date fixed
  • వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో మూవీ 'ఆదర్శ కుటుంబం'
  • అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల
  • హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి.. సంగీతం తమన్
  • హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణం
  • 'ఏకే 47' అనే ట్యాగ్‌లైన్‌తో పెరుగుతున్న ఆసక్తి
విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా 'ఆదర్శ కుటుంబం.. హౌస్ నెం.47 (ఏకే-47)'. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి చిత్రబృందం కీలక ప్రకటన చేసింది. సినిమా విడుదల తేదీని అధికారికంగా ఖరారు చేస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

వెంకటేష్‌కు ఇది 77వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో ఆయన సరసన 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

‘ప్రతి కుటుంబం గుర్తుంచుకోవాల్సిన తేదీ’ అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన పోస్టర్‌లో ‘ఆదర్శ కుటుంబం’ టైటిల్‌తో పాటు ‘AK 47’ అని ట్యాగ్ తో సినిమాపై అంచనాలను పెంచేశారు. దీంతో ఇది క్లాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటూనే, యాక్షన్ అంశాలు కూడా ఉంటాయనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

ముఖ్యంగా, త్రివిక్రమ్ నుంచి చాన్నాళ్ల తర్వాత రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 2024లో వచ్చిన 'గుంటూరు కారం' తర్వాత త్రివిక్రమ్ లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం' తెరకెక్కిస్తున్నారు. 
Venkatesh
Trivikram Srinivas
Adarsha Kutumbam
Srinidhi Shetty
AK 47 Movie
Release Date

More Telugu News