‘నాకు ఏం జరిగినా రేవంత్ రెడ్డిదే బాధ్యత’.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
- సెక్యూరిటీ తొలగింపుపై ఆర్ఎస్ ప్రవీణ్ ఆగ్రహం
- ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపణ
- ముందస్తు సమాచారం లేకుండానే భద్రత తొలగించారని విమర్శ
- ప్రజల కోసమే పోరాటం చేస్తున్నానన్న ప్రవీణ్ కుమార్
- భద్రత తొలగించినా వెనక్కి తగ్గబోనని స్పష్టీకరణ
రాష్ట్ర ప్రభుత్వం తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రవీణ్ ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తున్నందుకే అధికార పార్టీ తనను లక్ష్యంగా చేసుకుందని అన్నారు. విపక్ష నేతగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఒక మాజీ ఉన్నతాధికారిగా, ప్రజానేతగా ఉన్న తనకు రక్షణ లేకుండా చేయడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు.
తాను చేసే ప్రతి పోరాటం ప్రజల కోసమేనని, అందులో ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదని ప్రవీణ్ కుమార్ చెప్పారు. భద్రత తొలగించినంత మాత్రాన తాను భయపడబోనని తెలిపారు. ప్రజల తరఫున మరింత బలంగా గొంతెత్తుతానని స్పష్టం చేశారు.