‘హర్మూజ్’లో మళ్లీ ఉద్రిక్తత.. ఇరాన్పై అమెరికా మెరుపు దాడులు
- కార్గో షిప్పై ఇరాన్ డ్రోన్ దాడికి అమెరికా ప్రతీకారం
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలే లక్ష్యంగా అమెరికా సైన్యం దాడులు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందన్న ట్రంప్
సింగపూర్ జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎం/వీ ఎవర్ లవ్లీ’ అనే కంటైనర్ నౌకపై జూన్ 25న ఇరాన్ ‘వన్-వే అటాక్’ డ్రోన్తో దాడికి తెగబడింది. తైవాన్కు చెందిన ఎవర్గ్రీన్ మెరైన్ సంస్థ నడుపుతున్న ఈ నౌక.. హర్మూజ్ జలసంధి గుండా ఒమన్ తీరం మీదుగా ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దాడిలో నౌక పైభాగం, బ్రిడ్జి ఏరియా పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ.. సిబ్బంది ఎవరికీ గాయాలు కాలేదు. చమురు లీకేజీ వంటి పర్యావరణ నష్టం జరగకపోవడంతో నౌక తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ దాడికి ఇరానే కారణమని అమెరికా అధికారికంగా ధ్రువీకరించింది.
ఈ ఘటనపై ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందిస్తూ.. ఇరాన్ మొత్తం నాలుగు డ్రోన్లతో ఈ దాడికి వ్యూహం రచించిందని, వాటిలో మూడింటిని అమెరికా దళాలు గాల్లోనే అడ్డుకోగా, నాలుగోది నౌకను ఢీకొట్టిందని వెల్లడించారు. నౌకకు నష్టం వాటిల్లినప్పటికీ ప్రయాణం సాగిస్తోందని చెబుతూ.. జలసంధిలో సురక్షిత ప్రయాణాల కోసం గత వారం స్విట్జర్లాండ్లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఇరాన్పై ఎలాంటి చర్యలు ఉంటాయని విలేకరులు ప్రశ్నించగా.. ‘త్వరలోనే మీకే తెలుస్తుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే అమెరికా సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగింది. ఇరాన్లోని క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలతో పాటు తీరప్రాంత రాడార్ వ్యవస్థలపై కచ్చితత్వంతో కూడిన క్షిపణి దాడులు చేసినట్లు ప్రకటించింది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన నౌకాయాన మార్గంలో స్వేచ్ఛను దెబ్బతీసేలా ఇరాన్ చేసిన దాడికి ఇది తగిన గుణపాఠమని సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.