యాపిల్ యూజర్లకు భారీ షాక్.. మ్యాక్బుక్, ఐప్యాడ్ ధరల పెంపు
- భారత్లో మ్యాక్బుక్, ఐప్యాడ్ ధరలను భారీగా పెంచిన యాపిల్
- కొన్ని మోడళ్లపై లక్ష రూపాయల వరకు పెరిగిన ధర
- ఏఐ డిమాండ్తో పెరిగిన మెమొరీ చిప్ల ధరలే కారణమని వెల్లడి
- కస్టమర్లపై భారం మోపక తప్పడం లేదన్న యాపిల్
- వివిధ మోడళ్లపై రూ.10,000 నుంచి రూ.లక్ష వరకు పెంపు
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) కోసం పెరుగుతున్న డిమాండ్తో మెమొరీ, స్టోరేజ్ చిప్ల ధరలు అమాంతం పెరిగాయి. ఈ భారాన్ని ఇకపై భరించలేమని, అందుకే ధరలు పెంచాల్సి వస్తోందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కొద్దిరోజుల క్రితమే సంకేతాలిచ్చారు. తాజా పెంపుతో మ్యాక్బుక్ ప్రో 14-అంగుళాల (ఎం5 మాక్స్ వేరియంట్) ధరపై ఏకంగా రూ. 1,00,000 పెరిగింది. బేస్ మ్యాక్బుక్ ప్రో 14 అంగుళాల మోడల్పై రూ. 70,000, మ్యాక్బుక్ ఎయిర్ 13 అంగుళాలపై రూ.30,000, ఐప్యాడ్ ఎయిర్ 11 అంగుళాల మోడల్పై రూ. 25,000 మేర ధరలు పెరిగాయి.
"విడిభాగాల ధరలు ఇంత వేగంగా, ఈ స్థాయిలో పెరగడం ఎప్పుడూ చూడలేదు. ఇప్పటివరకు వినియోగదారులపై భారం పడకుండా జాగ్రత్త వహించాం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెంపు అనివార్యమైంది" అని యాపిల్ సంస్థ వెల్లడించింది. దిగుమతి సుంకాల కారణంగా ఇప్పటికే భారత్లో అధిక ధరలు చెల్లిస్తున్న వినియోగదారులకు ఈ పెంపు మరింత భారంగా మారనుంది. ముఖ్యంగా విద్యార్థులు, నిపుణులు, కొత్తగా యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.
భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా యాపిల్ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. మ్యాక్బుక్, ఐప్యాడ్లతో పాటు హోమ్పాడ్, యాపిల్ టీవీ ధరలను కూడా కంపెనీ సవరించింది.