2028 నాటికి ఫస్ట్ ఫేజ్ పూర్తి: అమరావతి బసవతారకం ఆసుపత్రి సైట్లో బాలకృష్ణ
- ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన బాలయ్య
- నిర్మాణ పనులు చాలా వేగంగా సాగుతున్నాయని వెల్లడి
- లాభాపేక్ష లేకుండా క్యాన్సర్ బాధితులకు సేవ చేయడమే లక్ష్యమన్న బాలయ్య
అమరావతిలో క్యాన్సర్ పేషెంట్లకు వరంగా మారబోతున్న ఈ మెగా ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రస్తుతం చాలా వేగంగా సాగుతున్నాయని బాలకృష్ణ తెలిపారు. వచ్చే నెల పుట్టింగ్ పనులు మొదలవుతాయని చెప్పారు. హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు వర్కర్లు పగలూ రాత్రి షిఫ్టుల్లో కష్టపడుతున్నారని తెలిపారు. అయితే, వర్షాకాలం కారణంగా పనులు కొంత నెమ్మదించే అవకాశం ఉందని చెప్పారు.
హైదరాబాద్లోని బసవతారకం ఆసుపత్రిని ఆల్రెడీ మరింత విస్తరిస్తున్నామని... అదే క్రమంలో ఏపీ రాజధానిలోనూ అధునాతన వైద్యం అందించడమే తమ లక్ష్యమని బాలయ్య స్పష్టం చేశారు. అమరావతి ప్రాజెక్టుకు సంబంధించి 2028 నాటికి మొదటి దశ నిర్మాణ పనులు పూర్తై, రోగులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా, కేవలం క్యాన్సర్ బాధితులకు ప్రపంచ స్థాయి సేవ చేయాలనే ఏకైక పవిత్ర ధ్యేయంతోనే ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.