పాఠ్యాంశంగా 'ఎమర్జెన్సీ'.. 9వ తరగతి సిలబస్లో చేర్చిన ఎన్సీఈఆర్టీ
- కొత్త సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో చేర్చిన ఎన్సీఈఆర్టీ
- ప్రజాస్వామ్యానికి పెద్ద సవాల్గా ఎమర్జెన్సీని వర్ణన
- నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ మార్పు
- ఎన్సీఈఆర్టీ నిర్ణయాన్ని స్వాగతించిన కేంద్ర ప్రభుత్వం
నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఎన్సీఈఆర్టీ తన పాఠ్యప్రణాళికను సవరించింది. ఇందులో భాగంగా, 9వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన "అండర్స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్" పుస్తకంలో ఎమర్జెన్సీపై ప్రత్యేక విభాగాన్ని పొందుపరిచారు. ఆ కాలంలో ప్రాథమిక హక్కుల రద్దు, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు, రాజకీయ ప్రత్యర్థుల అరెస్టులు వంటి అంశాలను ఈ పాఠ్యాంశంలో కూలంకషంగా వివరించారు.
ఎన్సీఈఆర్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతించారు. ఎమర్జెన్సీ వంటి చీకటి రోజులు పునరావృతం కాకుండా ఉండాలంటే, ఆనాటి చారిత్రక పరిణామాల గురించి భావి తరాలకు తెలియజేయడం అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ, రాజ్యాంగ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అదే ధోరణిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. అయితే, సిలబస్లో చోటుచేసుకున్న ఈ మార్పులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం చరిత్రను తమకు అనుకూలంగా వక్రీకరిస్తోందని ఆరోపిస్తున్నాయి.