'యార్సగూంబా'... నేపాలీలను వెర్రెత్తిస్తున్న 'హిమాలయ బంగారం'!
- హిమాలయన్ గోల్డ్ కోసం నేపాల్ పర్వతాల్లో మొదలైన వేట
- కిలోకు రూ.20 లక్షల వరకు ధర పలుకుతున్న యార్సగూంబా ఫంగస్
- ప్రాణాలకు తెగించి సేకరిస్తున్న వేలాది మంది గ్రామస్థులు
- అధిక సేకరణ, వాతావరణ మార్పులతో తగ్గుతున్న దిగుబడి
చైనా, టిబెట్ సంప్రదాయ వైద్యంలో యార్సగూంబాకు విశేష ప్రాధాన్యత ఉంది. శరీర దృఢత్వాన్ని, రోగనిరోధక శక్తిని పెంపొందించే ఔషధంగా దీనిని పరిగణిస్తారు. ముఖ్యంగా, దీనికున్న ప్రత్యేక లక్షణాల వల్ల దీనిని 'హిమాలయన్ వయాగ్రా' అనే కూడా పిలుస్తారు. ఈ ఫంగస్ సేకరణపై స్థానిక ప్రభుత్వాలు ప్రస్తుతం పలు నిబంధనలు విధిస్తూ, ప్రజల ఆదాయ మార్గాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపడుతున్నాయి.
శాస్త్రీయంగా 'ఓఫియోకార్డిసెప్స్ సినెన్సిస్' అని పిలిచే ఈ యార్సగూంబా, ఒక రకమైన గొంగళిపురుగుపై పెరిగే పరాన్నజీవి ఫంగస్. ప్రతి ఏటా మంచు కరిగిన తర్వాత మే నుంచి జూలై మాసాల మధ్య, సముద్ర మట్టానికి 3,500 నుండి 5,000 మీటర్ల ఎత్తులో మాత్రమే ఇది లభిస్తుంది. ఈ సీజన్లో డోల్పా, జుమ్లా, ముగు వంటి జిల్లాల్లోని గ్రామాలు దాదాపు ఖాళీ అవుతాయి. మహిళలు, చిన్నారులతో సహా కుటుంబ సభ్యులంతా ప్రతికూల వాతావరణంలోనూ తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసుకుని దీని కోసం అన్వేషిస్తుంటారు.
అయితే, ఈ 'బంగారు వేట'లో తీవ్రమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎత్తైన ప్రదేశాల్లో ప్రాణవాయువు లోపం (ఆల్టిట్యూడ్ సిక్నెస్), ప్రమాదవశత్తూ జారిపడటం, ఆకస్మిక వాతావరణ మార్పుల కారణంగా గతంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, మితిమీరిన సేకరణ, వాతావరణ మార్పుల ప్రభావంతో యార్సగూంబా దిగుబడి ఏటేటా తగ్గుతోందని, ఇది పర్యావరణ సమతుల్యతపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.