డేటింగ్ యాప్లో కాంచీపురం టాప్... రహస్య సంబంధాల కోసం ఆసక్తి!
- రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచిన ఆలయ నగరం
- గ్లోబల్ ర్యాంకింగ్స్లో 8 నుంచి 3వ స్థానానికి ఎగబాకిన భారత్
- భారత్లో మారుతున్న వివాహ బంధాల స్వరూపంపై సర్వే
- 60% మంది సంప్రదాయేతర సంబంధాలకు సిద్ధమన్న నివేదిక
ఈ డేటింగ్ యాప్, వివాహ బంధంలో ఉంటూనే బయట రహస్య సంబంధాలను కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని సేవలు అందిస్తుండటం గమనార్హం. 2026 మే నాటి డేటా ప్రకారం ఈ నగరం మొదటి స్థానంలో ఉండగా, వరుసగా రెండో ఏడాది కూడా ఇదే స్థానాన్ని నిలబెట్టుకోవడం గమనార్హం. గత వేసవిలోనూ ఈ యాప్లో చేరికలకు సంబంధించి కాంచీపురం టాప్లో నిలిచింది.
ఈ జాబితాలో కాంచీపురం తర్వాత కోయంబత్తూర్, తిరువళ్లూర్, చెన్నై వంటి నగరాలు ఉండటం గమనార్హం. దీంతో ఈ ప్లాట్ఫామ్ ర్యాంకింగ్స్లో దక్షిణాది నగరాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం నగరాల పరంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు కూడా ఇటువంటి రహస్య సంబంధాలపై భారతీయుల ఆసక్తి గణనీయంగా పెరిగింది. ఈ యాప్లో సభ్యత్వ నమోదులో భారత్ గతేడాది 20 దేశాల్లో 8వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది ఏకంగా మూడో స్థానానికి ఎగబాకింది.
ఇలాంటి మరో డేటింగ్ ప్లాట్ఫామ్ 'గ్లీడెన్' కూడా ఈ ఏడాది ప్రారంభంలోనే భారత్లో తమకు 40 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నట్లు ప్రకటించింది. ఈ గణాంకాలు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, చిన్న నగరాల్లోనూ ఈ ధోరణి పెరుగుతోందని స్పష్టం చేస్తున్నాయి.
ఈ పరిణామాలపై యాష్లే మాడిసన్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పాల్ కీబుల్ మాట్లాడుతూ.. "సభ్యత్వ నమోదులో భారత్ 8వ స్థానం నుంచి 3వ స్థానానికి రావడం ఒక పెద్ద మార్పును సూచిస్తోంది. బంధాలు, గోప్యత, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి విషయాలపై భారతీయుల దృక్పథం మారుతోంది. ఈ ఆసక్తి కేవలం సంప్రదాయ మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని నగరాలు కూడా ఈ చర్చను ముందుకు తీసుకెళ్తున్నాయి. గోప్యత, అర్థవంతమైన బంధాల కోసం అన్వేషణ భౌగోళిక సరిహద్దులకు అతీతంగా ఉందని ఇది చూపిస్తోంది" అని వివరించారు.
ఈ మారుతున్న వైఖరిని 2024లో గ్లీడెన్ నిర్వహించిన ఒక సర్వే మరింత స్పష్టం చేసింది. టైర్ 1, టైర్ 2 నగరాల్లో 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న 1,503 మంది వివాహితులపై ఈ సర్వే నిర్వహించారు. ఇందులో పాల్గొన్న 60 శాతానికి పైగా ప్రజలు 'స్వింగింగ్' (వివాహ బంధంలో ఉన్నవారు పరస్పర అంగీకారంతో ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం) వంటి సంప్రదాయేతర సంబంధాల పట్ల సుముఖత వ్యక్తం చేశారు.