తిరుపతికి మరో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ.. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూ

Nara Lokesh witnesses MoU for new JSS Mahavidyapeetha campus in Tirupati
  • తిరుపతిలో జేఎస్ఎస్ మహావిద్యాపీఠం ఆఫ్-క్యాంపస్ ఏర్పాటు
  • మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం
  • 74 కోర్సులతో 10 వేల మందికి పైగా విద్యార్థులకు ఉన్నత విద్య
  • ప్రాజెక్టు ద్వారా 20 వేలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన
  • ప్రతిష్ఠాత్మక నాక్ ఏ++ గుర్తింపు పొందిన జేఎస్ఎస్ విద్యాసంస్థ
ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కొలువుదీరిన ప్రజాప్రభుత్వంలో విద్యా రంగం అభివృద్ధికి కీలక అడుగు పడింది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి మరో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ రానుంది. మైసూరు కేంద్రంగా పనిచేస్తున్న జగద్గురు శ్రీ శివరాత్రీశ్వర (జేఎస్ఎస్) మహావిద్యాపీఠం, తమ ఆఫ్-క్యాంపస్‌ను తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో అమరావతిలో ఏపీ ఉన్నత విద్యామండలి, జేఎస్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) జరిగింది. 

ఈ ఒప్పంద పత్రాలపై ఏపీ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, జేఎస్ఎస్ మహావిద్యాపీఠం టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, జేఎస్‌ఎస్ ఏహెచ్‌ఈఆర్ ప్రో ఛాన్స్‌లర్ డా.బి.సురేష్ సంతకాలు చేసి మార్చుకున్నారు.

70 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన జేఎస్ఎస్ విద్యాసంస్థకు భారత్‌తో పాటు విదేశాల్లో 300కు పైగా విద్యాసంస్థలు ఉన్నాయి. మైసూరు కేంద్రంగా ఉన్న జేఎస్‌ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JSS AHER), నాక్ నుంచి A++ గుర్తింపు పొందిన డీమ్డ్ విశ్వవిద్యాలయం. ప్రతిష్ఠాత్మక ఎన్‌ఐఆర్‌ఎఫ్ 2025 ర్యాంకింగ్స్‌లో విశ్వవిద్యాలయాల విభాగంలో 21వ స్థానంలో, ఓవరాల్‌గా 38వ స్థానంలో నిలిచి తన నాణ్యతను చాటుకుంది.

10 వేల మంది విద్యార్థులకు అవకాశం

ప్రతిపాదిత తిరుపతి క్యాంపస్‌ను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నారు. ఇందులో ఐదు సమగ్ర విద్యా పాఠశాలలను ఏర్పాటు చేస్తారు. అడ్వాన్స్‌డ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీస్, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ అండ్ బిహేవియరల్ సైన్సెస్, హెల్త్‌కేర్ అండ్ అలైడ్ సైన్సెస్, మేనేజ్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ టూరిజం, లా, హ్యూమానిటీస్, పాలసీ అండ్ గవర్నెన్స్ విభాగాల్లో మొత్తం 74 కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. 

క్యాంపస్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాక, 10 వేల మందికి పైగా విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించనున్నారు. వీటికి అదనంగా హెల్త్‌కేర్‌లో ఏఐ, సెమీకండక్టర్ అప్లికేషన్స్, హెల్త్ పాలసీ అండ్ గవర్నెన్స్, ఏరోస్పేస్ మెడిసిన్ వంటి ఆరు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా నెలకొల్పనున్నారు.

20 వేల ఉద్యోగాలు.. స్వర్ణాంధ్ర విజన్‌కు అనుగుణంగా..

ఈ ఒప్పందం ప్రకారం, తిరుపతిలో క్యాంపస్ ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు, చట్టబద్ధమైన అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సింగిల్-విండో విధానాన్ని కల్పిస్తుంది. క్యాంపస్ నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని జేఎస్ఎస్ మహావిద్యాపీఠమే భరిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఇది స్వర్ణాంధ్ర విజన్‌లో భాగంగా రాష్ట్ర యువతకు గొప్ప అవకాశాలను అందిస్తుంది. 

ఈ కార్యక్రమంలో జేఎస్ఎస్ ఏహెచ్ఈఆర్ రిజిస్ట్రార్ డా.బి.మంజునాథ, డీన్(రీసెర్చ్) డా. ప్రశాంత్ ఎమ్ విశ్వనాథ్, కేపీఎంపీ అడ్వైజరీ సర్వీసెస్ అసోసియేట్ డైరెక్టర్ ఎస్.రాఘవన్ తదితరులు పాల్గొన్నారు.


Go Back to Shorts
Nara Lokesh
JSS Mahavidyapeetha
Tirupati Education Hub
Andhra Pradesh Higher Education
JSS AHER Tirupati
Swarnandhra Vision

More Telugu News