తీర ప్రాంతాల్లో హరిత వలయాలు.. ‘కోస్తా గ్రీన్ బెల్ట్’పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సమీక్ష
- అటవీ, పర్యాటక ఉన్నతాధికారులతో పవన్ సమీక్షా సమావేశం
- గ్రీన్ జోన్స్ ఏర్పాటు చేయడం ద్వారా సముద్రపు కోతను అడ్డుకోవచ్చన్న పవన్
- స్థానిక ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని సూచన
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం సరికొత్త వ్యూహాలతో స్పీడ్ పెంచింది. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహజ వనరులను వాడుకుంటూ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నిరంతరం కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా... ఏపీకి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని అటు టూరిజం పరంగా, ఇటు పర్యావరణ పరంగా అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళుతోంది.
ఏపీ కోస్తా తీరాన్ని శరవేగంగా అభివృద్ధి చేయడమే కాకుండా, పర్యావరణ రక్షణ కోసం ‘కోస్తా గ్రీన్ బెల్ట్’ను విస్తరించేందుకు డిప్యూటీ పవన్ కల్యాణ్ నడుం బిగించారు. ఇందులో భాగంగా ఈరోజు సచివాలయంలో అటవీ, పర్యావరణ శాఖ ఉన్నతాధికారులతో ఆయన ఒక కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
తీర ప్రాంతాల్లో భారీగా మొక్కలు నాటి, హరిత వలయాలను (గ్రీన్ జోన్స్) ఏర్పాటు చేయడం ద్వారా సముద్రపు కోతను అడ్డుకోవచ్చని, తుపానుల తీవ్రతను తగ్గించవచ్చని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దీనికోసం తక్షణమే ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ గ్రీన్ బెల్ట్ ప్రాజెక్ట్లో కేవలం ప్రభుత్వానిదే కాకుండా స్థానిక ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. తీర ప్రాంత గ్రామాల్లో సామాజిక అడవుల (Social Forestry) పెంపకానికి ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించాలని, తద్వారా పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని అధికారులకు స్పష్టం చేశారు.