సర్వే శాఖ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు.. ఏసీబీ దాడుల్లో రూ.1.54 కోట్ల నగదు, కిలో బంగారం సీజ్
- భూపరిపాలన శాఖ అధికారి నరహరి నివాసంలో ఏసీబీ సోదాలు
- ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆకస్మిక దాడులు
- రూ.5 కోట్లకు పైగా విలువైన ఆస్తులు గుర్తించినట్లు వెల్లడి
- అధికారి నరహరిని అరెస్ట్ చేసి విచారిస్తున్న ఏసీబీ
ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలోని బృందాలు ఈ సోదాలు చేపట్టాయి. హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాకలోని నరహరి నివాసం, నారాయణగూడలోని ఆయన కార్యాలయంతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు జరిగాయి. ఈ క్రమంలో నరహరి ఇంట్లోని బెడ్రూమ్లో ఉన్న బీరువా పైభాగంలో దాచిన రూ.1.54 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు సుమారు ఒక కిలో బంగారం, పలు కీలక ఆస్తి పత్రాలను కూడా సీజ్ చేశారు.
స్వాధీనం చేసుకున్న ఆస్తుల ప్రభుత్వ విలువ సుమారు రూ.5 కోట్లకు పైగా ఉంటుందని, బహిరంగ మార్కెట్ విలువ అంతకు అనేక రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కోటి రూపాయలకు పైగా విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంకు లాకర్లను కూడా అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం బ్యాంకులకు లేఖలు రాశారు.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ ఈ చర్యలు చేపట్టింది. అరెస్ట్ చేసిన నరహరిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. ఆయన కుమారుడి పేరుతో ఉన్న స్థిరాస్తుల వివరాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.
నగదును బెడ్ రూమ్లోని బీరువా పైన ఉన్న కబోర్డులో గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఏసీబీ దాడుల చరిత్రలో ఒకేచోట ఇంత భారీ మొత్తంలో నగదు లభించడం అరుదని ఆయన పేర్కొన్నారు. సుంకరి నరహరిని అరెస్టు చేశామని, రేపు కోర్టులో హాజరుపరుస్తామని ఆయన వెల్లడించారు.