రాయలసీమ రైతు అద్భుతం... అనంతపురం గడ్డపై ఎర్రెర్రని జ్యూసీ ఆపిల్ సాగు!
- అనంతపురం జిల్లాలో యాపిల్స్ పండించిన రైతు రమణారెడ్డి
- ఇజ్రాయెల్ టెక్నాలజీతో వేడిని తట్టుకునే రకం సాగు
- ఎకరాకు రూ. 4 నుంచి 7 లక్షల ఆదాయానికి అవకాశం
- రైతు ప్రయోగంపై ప్రభుత్వం, అధికారులు ప్రశంసలు
- రాయలసీమ రైతులకు కొత్త ఆశలు చూపిస్తున్న ప్రయోగం
ఇజ్రాయెల్కు చెందిన ప్రత్యేకమైన, వేడిని తట్టుకునే 'KLD' రకం యాపిల్స్ను ఆయన సాగు చేశారు. 2024లో తనకున్న 2.5 ఎకరాల పొలంలో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో సుమారు 600 మొక్కలు నాటారు. కేవలం 18 నెలల్లోనే దాదాపు 2 టన్నుల దిగుబడి సాధించారు. ఈ యాపిల్స్ నాణ్యతలో, రుచిలో సిమ్లా యాపిల్స్కు ఏమాత్రం తీసిపోవడం లేదని ఆయన తెలిపారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో నవంబర్-జనవరి మధ్య యాపిల్స్ కోతకు వస్తాయి. కానీ, రమణారెడ్డి పండించిన పంట మార్చి-మే నెలల్లో చేతికి రావడంతో మార్కెట్లో మంచి డిమాండ్ లభిస్తోంది. కిలో యాపిల్స్ను స్థానికంగా రూ. 120 నుంచి రూ. 170 వరకు విక్రయిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఓ రిటైలర్ ఒకేసారి టన్ను యాపిల్స్ను రూ. 1.5 లక్షలకు కొనుగోలు చేశారు.
ఈ విజయం వెనుక రమణారెడ్డి ఎంతో కృషి ఉంది. గతంలో హిమాచల్ రకం యాపిల్స్ సాగుచేసి సుమారు రూ. 8 లక్షలు నష్టపోయారు. అయినా పట్టువదలకుండా ఇజ్రాయెల్లో స్నేహితుడి ద్వారా వేడిని తట్టుకునే మొక్కలను తెప్పించుకుని ఈ విజయం సాధించారు. గతంలో ఈయన డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూరం వంటి విదేశీ పండ్లను కూడా ఈ ప్రాంతానికి పరిచయం చేశారు.
రమణారెడ్డి ప్రయత్నాన్ని అనంతపురం జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ నమూనాను ఇతర ప్రాంతాల్లో అమలు చేసేందుకు అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో యాపిల్ సాగుకు కొత్త అవకాశాలు ఏర్పడినట్టయింది.