కెనడా వెళ్లే భారతీయ విద్యార్థులకు షాక్.. మారిన ఇమ్మిగ్రేషన్ రూల్స్
- మానిటోబా కీలక శాశ్వత నివాస మార్గం రద్దు
- భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం
- చదువు కంటే ఉద్యోగ అనుభవానికి ప్రాధాన్యం
- ఆరు నెలల పని అనుభవం కీలకం
- కెనడా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం
మానిటోబా ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ (ఎంపీఎన్పీ) కింద అమల్లో ఉన్న ‘కెరీర్ ఎంప్లాయ్మెంట్ పాత్వే’ (సీఈపీ)ను వెంటనే అమల్లోకి వచ్చేలా రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు మానిటోబాలో కనీసం ఏడాది పాటు చదివి, అర్హత కలిగిన ఉద్యోగం సంపాదిస్తే పీఆర్కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ముఖ్యంగా డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఈ మార్గాన్ని ఎక్కువగా వినియోగించుకునేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో విద్యార్థులు ఇతర ఇమ్మిగ్రేషన్ మార్గాలను ఆశ్రయించాల్సి ఉంటుంది.
ఇకపై చదువు మాత్రమే సరిపోదని, స్థానిక ఉద్యోగ అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని మానిటోబా స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘స్కిల్డ్ వర్కర్ ఇన్ మానిటోబా’ ప్రోగ్రామ్ కింద కనీసం ఆరు నెలలు ఒకే యజమాని వద్ద పూర్తి స్థాయి ఉద్యోగం చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వనుంది. అంటే విద్యార్హతల కంటే ఉద్యోగ అనుభవం, స్థానిక కార్మిక మార్కెట్తో అనుసంధానం కీలకంగా మారనున్నాయి.
భారతీయ విద్యార్థులకు ఈ నిర్ణయం ప్రత్యేకంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మానిటోబాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉంది. తక్కువ జీవన వ్యయం, మంచి విద్యాసంస్థలు, సులభమైన పీఆర్ అవకాశాల కారణంగా చాలా మంది ఈ ప్రావిన్స్ను ఎంచుకుంటున్నారు. అయితే తాజా నిర్ణయంతో కెనడాలో స్థిరపడాలనుకునే విద్యార్థులు ఇకపై చదువుతో పాటు ఉద్యోగ అనుభవం సంపాదించడంపైనా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.