అఖిలేష్ యాదవ్ కుమార్తెపై ట్రోలింగ్.. తీవ్రంగా స్పందించిన సీఎం యోగి

  • అఖిలేష్ యాదవ్ కుమార్తెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్
  • తీవ్రంగా ఖండించిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
  • ట్రోలర్స్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశం
  • రామమందిర విరాళాలపై అఖిలేష్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పరిణామం
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన రాజకీయ ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్‌పై సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న అనుచిత ప్రచారాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా, ఏ కుమార్తెకూ ఇటువంటి అవమానం జరగకూడదని స్పష్టం చేస్తూ, దీనికి బాధ్యులైన వారిపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల నిర్వహణపై అఖిలేష్ యాదవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివాదం మొదలైంది. భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల విరాళాలు గల్లంతయ్యాయని, ఇది ఆలయ ట్రస్టుకు సిగ్గుచేటని ఆయన ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలను సాకుగా తీసుకుని కొందరు అఖిలేష్ కుమార్తెను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ ప్రారంభించారు. అదితి యాదవ్ రూ. 7 కోట్లు దొంగిలించి, తన స్నేహితుడితో కలిసి నైజీరియాకు పారిపోయిందంటూ మార్ఫింగ్ చేసిన చిత్రాలు, ఏఐ-జనరేటెడ్ ఫోటోలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు.

దీపిక రస్తోగి అనే నెటిజన్ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, అఖిలేష్ యాదవ్ కూతురు తన ఇంట్లోనే రూ. 7 కోట్లు అపహరించి నైజీరియాలో ఉంటున్నారని, కానీ మాజీ సీఎం మాత్రం అయోధ్య రామమందిరం నిధుల గురించి మాట్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.

అఖిలేష్ కూతురుని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడిని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై కాన్పూర్, ప్రతాప్‌గఢ్‌లలో పోలీసులు ఇప్పటికే పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించడం, ఫోర్జరీ వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

శనివారం అజంగఢ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ, "ఈ పోస్టుల గురించి తెలిసిన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించాను. ఎవరి కుమార్తె అయినా మన కుమార్తెతో సమానమే. ప్రతి ఆడపిల్ల కూడా మన కూతురు వంటిదే అనే సంస్కారంతో మనం పెరిగాం" అని పేర్కొన్నారు. అదితిని సోషల్ మీడియాలో లక్ష్యంగా చేసుకోవడాన్ని సమాజ్‌వాదీ పార్టీ నేతలు కూడా తీవ్రంగా ఖండించారు.

Yogi Adityanath
Aditi Yadav
Akhilesh Yadav
Samajwadi Party
Aditi Yadav trolling case

More Telugu News