కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు: వైఎస్ షర్మిల
- సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అయిందన్న షర్మిల
- అప్పులు చేయడంలో ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని ఎద్దేవా
- పాలన అంతా మాయాబజార్ లా కనిపిస్తోందని విమర్శ
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో... ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన ‘సూపర్ సిక్స్’ వాగ్దానాలు రెండేళ్ల పాలనలో పూర్తిగా అట్టర్ ప్లాప్ అయ్యాయని ఆమె దుయ్యబట్టారు.
రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని, కేవలం అప్పులు చేయడంలోనే ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని షర్మిల ఎద్దేవా చేశారు. 'పబ్లిసిటీ పీక్.. పాలన వీక్', 'అప్పులు ఫుల్.. అభివృద్ధి నిల్' అని విమర్శించారు. ప్రస్తుత పరిపాలన అంతా ఒక ‘మాయాబజార్’లా కనిపిస్తోందని, ప్రజలను భ్రమల్లో ముంచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తామన్న హామీ ఎటు పోయిందని నిలదీశారు.
బుట్టెడు ఆశలు చూపి ప్రజల నుంచి ఓట్లు దండుకున్న ఎన్డీయే నేతలు, అధికారంలోకి వచ్చాక కేవలం గుప్పెడు హామీలను కూడా సరిగ్గా అమలు చేయలేకపోయారని ఆరోపించారు. ప్రజలను దారుణంగా వంచించిన ఈ ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.