రాజధాని నిర్మాణ వ్యయాలపై జగన్‌కు మంత్రి నారాయణ ఘాటు కౌంటర్

Minister Narayana sharp counter to Jagan on capital construction costs
  • గెజిటెడ్ అధికారుల నివాసాలకు చదరపు అడుగుకు రూ. 3,684 చొప్పున కేటాయించామన్న మంత్రి
  • అమరావతిలో మొత్తం 69 వంతెనలు నిర్మిస్తున్నామని వెల్లడి
  • అమరావతి అభివృద్ధిపై అసత్య ప్రచారం చేయొద్దని వైసీపీకి హితవు
అమరావతిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ హోమ్స్ నిర్మాణ వ్యయం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కంటే తక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శనివారం అమరావతిలో పర్యటించిన ఆయన కొండవీటి వాగు, పాలవాగుపై జరుగుతున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి... ఆయన వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చారు.

గెజిటెడ్ అధికారుల నివాసాల టెండర్ రూ.1,003 కోట్లకు, చదరపు అడుగుకు రూ.3,684 చొప్పున కేటాయించబడిందని చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ టెండర్ రూ.1,234 కోట్లకు, చదరపు అడుగుకు రూ.3,945 చొప్పున అమలవుతోందని వివరించారు. 

అమరావతి అభివృద్ధిలో భాగంగా సీఆర్డీఏ మొత్తం 69 వంతెనలను నిర్మిస్తోందని మంత్రి వెల్లడించారు. ఇందులో ప్రధాన వాగులపై 43 వంతెనలు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లేఅవుట్లలో మరో 26 వంతెనలు ఉన్నాయని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. వంతెనల సమీపంలో పేరుకుపోయిన మట్టి, తాత్కాలిక కట్టలు, ఇతర అడ్డంకులను వెంటనే తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కాలువల పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే అదనపు జేసీబీలను వినియోగించి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

వచ్చే ఏడాదిలోగా 69 వంతెనల్లో అధిక భాగం పూర్తవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి అభివృద్ధి పనులపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ప్రతిపక్ష నేతలకు సూచించిన ఆయన, ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Minister Narayana
Amaravati Capital
YS Jagan Mohan Reddy
AP CRDA
Amaravati Construction Costs
Kondaveeti Vagu Bridges

More Telugu News