మన గొప్ప ఎగుమతి మన ప్రజలే: విశాఖ సదస్సులో నారా లోకేశ్

Nara Lokesh says our greatest export is our people at Visakha Summit
  • వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యమన్న మంత్రి లోకేష్
  • నైపుణ్యం కలిగిన మానవ వనరులతోనే పోటీ సామర్థ్యం పెరుగుతుందని స్పష్టీకరణ
  • స్పీడ్, బ్రాండ్ సీబీఎన్, బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఏపీ ప్రత్యేకతలని వెల్లడి
  • యువతకు ఉపాధి అవకాశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్లు
  • దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వస్తున్నాయని వెల్లడి
వికసిత్ భారత్ నిర్మాణం అనే బృహత్ లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని, నైపుణ్యం కలిగిన మానవ వనరులను సృష్టించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. సుసంపన్న భవిష్యత్తు కోసం మానవ వనరులపై పెట్టుబడి పెట్టడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో జరిగిన ‘డీజీ 100ఎక్స్ ఏపీ’ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్య, ఆవిష్కరణల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న మేధావుల మధ్య ఉండటం ఆనందంగా ఉందని, అందరి లక్ష్యం ఒక్కటేనని.. అదే బలమైన భారతదేశ నిర్మాణమని పేర్కొన్నారు.

నైపుణ్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం

ప్రపంచం అత్యంత వేగంగా మారుతోందని, కృత్రిమ మేధ (ఏఐ) వంటి సాంకేతికతలు పరిశ్రమలను, ఉద్యోగాలను పునర్నిర్వచిస్తున్నాయని లోకేశ్ అన్నారు. ఈ పోటీ ప్రపంచంలో ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా అసలైన బలం భూమి, సహజ వనరులు కావని, ప్రతిభ కలిగిన మానవ వనరులేనని నొక్కిచెప్పారు. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ దేశానికి అత్యుత్తమ ప్రతిభను అందించిందని, చంద్రబాబు గత పదవీకాలాల్లో చేపట్టిన సంస్కరణల ఫలితంగానే నేడు సిలికాన్ వ్యాలీ నుంచి సింగపూర్ వరకు తెలుగువారు ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తుచేశారు. మన గొప్ప ఎగుమతి మన ప్రజలేనని, వారిపై పెట్టుబడి పెట్టడం మనందరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. 

విద్య అంటే కేవలం డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వడం కాదని, జీవితాంతం నేర్చుకునే ప్రక్రియలో ప్రభుత్వం భాగస్వామి కావాలని అన్నారు. అందుకోసం రెండు వారాల్లో "నైపుణ్యం పోర్టల్" ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నిన్నటి ఉద్యోగాల కోసం కాకుండా, ఏఐ, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్ వంటి భవిష్యత్ రంగాల కోసం విద్యార్థులను సిద్ధం చేస్తున్నామని వివరించారు.

వ్యక్తిగత ఇష్టంతోనే విద్యాశాఖ బాధ్యతలు

ముఖ్యమంత్రి శాఖల కేటాయింపు సమయంలో తాను అడిగి మరీ విద్యాశాఖను తీసుకున్నానని లోకేశ్ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. చాలామంది వద్దని వారించినా, తదుపరి తరం నాయకులను ప్రేరేపించే అవకాశం విద్య ద్వారానే లభిస్తుందనే బలమైన నమ్మకంతో ఈ బాధ్యతను స్వీకరించానని తెలిపారు. పిల్లలను నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తాను... వారు చూపే ప్రేమ, ఆప్యాయత, నిజాయతీ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి... అందుకే విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించానని చెప్పారు.

స్పీడ్, బ్రాండ్ సీబీఎన్, బుల్లెట్ ట్రైన్ సర్కార్

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించడంలో తమ ప్రభుత్వం ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తోందని లోకేశ్ అన్నారు. "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, బ్రాండ్ సీబీఎన్, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్" తమ ప్రత్యేకతలని అభివర్ణించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమవుతోందన్నారు. దీని ఫలితంగానే గూగుల్ సంస్థ భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఏపీలో పెట్టబోతోందని అన్నారు.

ఆర్సెలర్ మిట్టల్ ప్రాజెక్ట్‌ను కేవలం ఒక జూమ్ కాల్ ద్వారా సాధించామని, ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ కోసం 36 రోజుల్లోనే 600 ఎకరాలు అప్పగించామని ఉదాహరణలతో వివరించారు. "ఒక్కసారి మాతో చేతులు కలిపితే అది మీ ప్రాజెక్ట్ కాదు, మా ప్రాజెక్ట్" అని ఆయన భరోసా ఇచ్చారు. దేశానికి వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయని, ఇది తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు.

యువతకు ఉపాధి.. 22 పారిశ్రామిక క్లస్టర్లు

రాష్ట్ర యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు లోకేశ్ ప్రకటించారు. ఫిషరీస్, ఆక్వా, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, ఫార్మా, ఏరోస్పేస్, డేటా సెంటర్స్ వంటి రంగాల్లో ఈ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలను ఆయన హృదయపూర్వకంగా ఆహ్వానించారు. విద్యార్థులు ఓటమికి కుంగిపోవద్దని, తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఓడిపోయినా పట్టుదలతో పనిచేసి చారిత్రక మెజార్టీతో గెలిచానని గుర్తుచేశారు. తమది పారదర్శక ప్రభుత్వమని, సూచనలు, సలహాలను స్వీకరించడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డీజీ సంస్థ సీఈవో హేమంత్ సహల్, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ డా.సంగీత రెడ్డి, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, వివిధ యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Visakhapatnam DG 100X AP Summit
Andhra Pradesh Skill Development
IT Minister Nara Lokesh Speech
AP Industrial Clusters
Human Resources Investment

More Telugu News