టీసీఎస్ ఉద్యోగి ఆత్మహత్య... ఇద్దరు మహిళా సహోద్యోగులపై కేసు
- పుణె టీసీఎస్ ఉద్యోగి అమిత్ బ్రహ్మే ఆత్మహత్య
- ఇద్దరు మహిళా సహోద్యోగులు సహా ముగ్గురిపై కేసు నమోదు
- వేధింపులే కారణమని సూసైడ్ నోట్లో ఆరోపణ
- ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపిన టీసీఎస్
టీసీఎస్ హింజేవాడి కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న అమిత్ అభయ్ బ్రహ్మే (48) జూన్ 2న భోసరిలోని తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. ఆయన కుమారుడు అనీష్ బ్రహ్మే (19) జూన్ 9న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ అమిత్ రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు.
ఆ లేఖలో తన సహోద్యోగినులు అర్చన, శశ్వతి తనను అందరి ముందు పదేపదే అవమానించారని అమిత్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నైపుణ్యం లేని ప్రాజెక్టులను అప్పగించడం, పనితీరు సరిగా లేదని బహిరంగంగా మందలించడంతో పాటు ఉద్యోగానికి రాజీనామా చేయాలని తీవ్రంగా ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు తన స్నేహితుడు వినోద్ పలిచా కంపెనీ యాజమాన్యానికి తనపై అసత్య ఆరోపణలు చేస్తూ ఈమెయిల్స్ పంపాడని లేఖలో వివరించారు.
కుమారుడి ఫిర్యాదు మేర, పింప్రి-చించ్వాడ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 108 కింద అర్చన, శశ్వతి, వినోద్ పలిచాలపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై స్పందించిన టీసీఎస్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థలో ఉద్యోగుల శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ జరిపి వాస్తవాలను నిగ్గుతేలుస్తామని హామీ ఇచ్చింది. కాగా, ఐటీ ఉద్యోగుల సంఘం 'ఎన్ఐటీఈఎస్' ఈ ఉదంతంపై స్వతంత్ర్య దర్యాప్తు జరపాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసింది.