కర్ణాటకను కుదిపేసిన ధర్మస్థల కేసులో ప్రకాశ్ రాజ్ పేరు.. స్పందించిన నటుడు
- ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో తన పేరు రావడంపై స్పందించిన ప్రకాశ్ రాజ్
- రెండు రోజుల్లో వ్యక్తిగతంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానని వెల్లడి
- ఇది అత్యంత సున్నితమైన అంశమని, వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి
- కేసులో నిందితుడు దాఖలు చేసిన పిటిషన్లో ప్రకాశ్ రాజ్ పేరు ప్రస్తావన
ఈ విషయంపై ప్రకాశ్ రాజ్ తన 'ఎక్స్' ఖాతా ద్వారా కన్నడలో ఒక ప్రకటన విడుదల చేశారు. "ధర్మస్థల కేసుకు సంబంధించి మీడియా, సామాజిక మాధ్యమాల్లో నా గురించి జరుగుతున్న చర్చను గమనించాను. ఇది అత్యంత సున్నితమైన విషయం, లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం. కాబట్టి, ఈ సందేహాలపై స్పందించడం నా బాధ్యత" అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం తాను అందుబాటులో లేనని, మరో రెండు రోజుల్లో నేరుగా మీడియా సమక్షంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. అప్పటి వరకు గాలి వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు. కొందరు వ్యక్తులు ఈ అంశంపై ప్రచారం చేస్తున్న కల్పిత కథనాలను విశ్వసించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
కేసు నేపథ్యం ఏమిటి?
ధర్మస్థల ఆలయ పట్టణ పరిసరాల్లో గత రెండు దశాబ్దాలుగా వందలాది మృతదేహాలను ఖననం చేశారని, ఆ సమయంలో తనపై ఒత్తిడి తెచ్చారని గత ఏడాది (2025) ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. తవ్వకాల్లో అస్థిపంజరాలు బయటపడటంతో ఈ కేసు తీవ్రరూపం దాల్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చిన్నయ్య అనే వ్యక్తి జూన్ 11న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తూ, అందులో ప్రకాశ్ రాజ్ పేరును ప్రస్తావించాడు.