టీఎంసీలో ఆగని సంక్షోభం.. వారంలోనే మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా
- తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి రాజీనామా
- ఈ వారంలో టీఎంసీకి రాజీనామా చేసిన రెండో ఎంపీ ఈమె
- రాజీనామా తర్వాత అసోం సీఎం హిమంత శర్మతో సుస్మితా భేటీ
- ఇటీవలే మరో ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీకి గుడ్ బై
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో పెరుగుతున్న అసమ్మతి
రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్కు పంపిన తన రాజీనామా లేఖను తక్షణమే ఆమోదించాలని సుస్మితా దేవ్ కోరారు. రాజీనామా చేసిన కొద్దిసేపటికే, ఆమె ఢిల్లీలో అసోం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మతో ఆయన నివాసంలో నవ్వుతూ కనిపించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ కలయిక వెనుక ఉన్న కారణాలపై విలేకరులు ప్రశ్నించగా, "ఇది కేవలం అసోం కనెక్షన్ మాత్రమే" అంటూ ఆమె సమాధానం దాటవేశారు. దీంతో ఆమె బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలకు బలం చేకూరింది.
కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న సుస్మితా దేవ్, 2021లో టీఎంసీలో చేరారు. ఈమె అసోంకు చెందిన కాంగ్రెస్ దిగ్గజం సంత్ మోహన్ దేవ్ కుమార్తె. గతంలో కాంగ్రెస్ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలిగా, సిల్చార్ నుంచి ఎంపీగా పనిచేశారు.
ఇదే వారంలో సోమవారం నాడు, టీఎంసీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బెంగాల్లో పార్టీ ఓటమిని, ప్రజాతీర్పును గౌరవిస్తూ తాను వైదొలగుతున్నట్లు ఆయన ప్రకటించడం చర్చనీయాంశమైంది.
ఈ వరుస రాజీనామాలు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీలో నెలకొన్న తీవ్ర అసంతృప్తికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే, 58 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి, ప్రతిపక్ష నేత పదవికి అధికారిక అభ్యర్థిని కాదని వేరే వ్యక్తికి మద్దతు పలికారు. స్పీకర్ కూడా వారి నిర్ణయాన్నే మద్ధతు తెలపడంతో పార్టీలోని లోతైన విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇప్పుడు ఈ అసమ్మతి సెగ జాతీయ స్థాయికి పాకడంతో టీఎంసీ అధిష్టానం తీవ్ర ఆందోళనలో పడింది.