రేవంత్ పర్యటన విహారయాత్ర లాంటిది: శ్రీనివాస్ గౌడ్
- పాలమూరు-రంగారెడ్డి పథకంలో ప్రభుత్వ తీరుపై శ్రీనివాస్ గౌడ్ విమర్శలు
- కేసీఆర్ హయాంలోనే 80 నుంచి 90 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడి
- మిగిలిన పనులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తోందని విమర్శ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు పాదయాత్రకు సిద్ధమైనప్పుడే ప్రభుత్వానికి ప్రాజెక్టుల తనిఖీలు గుర్తొస్తున్నాయని, ఇందులో వారి చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ హయాంలోనే ఈ ప్రాజెక్టుల పనులు 80 నుంచి 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కేవలం పబ్లిసిటీ కోసం చేసిన 'హెలికాప్టర్ విహారయాత్ర' లాంటిదేనని విమర్శించారు.
కొల్లాపూర్ ప్రాంతంలో హార్టికల్చర్, పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటును పక్కనబెట్టారని, మామిడి రైతులకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. అలాగే, బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య జరిగి రెండేళ్లవుతున్నా విచారణలో పురోగతి లేదని, సీఎం పర్యటనల వేళ ప్రతిపక్ష నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పిక్నిక్ తరహా పర్యటనలు ఆపి, పాలమూరు అసలు సమస్యలపై, 'రామన్నగుట్ట రిజర్వాయర్' ప్రాజెక్టుపై స్పష్టమైన సమీక్ష నిర్వహించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.