మళ్లీ డీలిమిటేషన్‌ బిల్లు.. ప్రాంతీయ పార్టీలతో కేంద్రం రహస్య సంప్రదింపులు!

  • డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం మరోసారి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం
  • 2029 ఎన్నికల లోపే పూర్తి చేయాలని యోచన
  • ప్రాంతీయ పార్టీలతో కేంద్రం సంప్రదింపులు
  • గతంలోని వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ఆచితూచి అడుగులు
  • ఏకాభిప్రాయం కోసం ముందస్తు చర్చలు
నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మరోసారి తెచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. 2029 లోక్‌సభ ఎన్నికల కంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కసరత్తు చేస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఇది సున్నితమైన అంశం కావడంతో ఎలాంటి వివాదాలకు తావులేకుండా రాజకీయంగా ఏకాభిప్రాయం సాధించాలని ప్రభుత్వం యత్నిస్తున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.

ఈ సంప్రదింపుల్లో భాగంగా కేంద్రం ఇప్పటికే తమిళనాడుకు చెందిన డీఎంకేతో పాటు పలు కీలక ప్రాంతీయ పార్టీలతో ప్రాథమిక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్య 1971 జనాభా లెక్కల ఆధారంగానే చేసి ఉంది. ఆ గడువు ముగియనుండటంతో కొత్తగా పునర్విభజన చేపడితే జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరిగి, జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోతాయనే తీవ్ర ఆందోళనలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అందరికీ ఆమోదయోగ్యమైన ఫార్ములాను రూపొందించేందుకు కేంద్రం యత్నిస్తోందని సమాచారం.

నిజానికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువచ్చింది. అయితే ఆ సమయంలో ప్రాంతీయ పార్టీల నుంచి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పార్లమెంటులో వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు వీగిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే.. ఈసారి బిల్లును నేరుగా సభలో పెట్టకుండా, ముందుగానే విస్తృత అవగాహన కుదిరిన తర్వాతే తదుపరి అడుగు వేయాలని కేంద్రం భావిస్తోందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Delimitation
Delimitation bill
2029 elections
Government
DMK
South Indian states
parliament delimitation

More Telugu News