అమరావతిపై జగన్ వ్యాఖ్యలు నవ్వొచ్చేలా ఉన్నాయి: మంత్రి నారాయణ
- అమరావతి ప్రాంత రైతుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న నారాయణ
- రాజధాని ప్రాంతాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని మండిపాటు
- జగన్ క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితవు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి ప్రాంతంలో రైతుల మధ్య విభేదాలు సృష్టించి, రాజధాని ప్రాంతాన్ని అస్థిరపరచాలని వైసీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. "వైసీపీ కావాలనే రైతులను రెచ్చగొడుతూ గొడవలు పెట్టాలని చూస్తోంది. ఇప్పుడు అమరావతిపై కమిటీలు వేస్తామనడం నవ్వొచ్చేలా ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్ క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలి" అని హితవు పలికారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే రోడ్లు, వంతెనలు, భవనాలు, పైప్లైన్ల నిర్మాణం జరిగిపోయిన తర్వాత.. మళ్లీ రైతులకు భూములు తిరిగి ఇచ్చేస్తామంటూ వైసీపీ చెప్తున్న మాటల్లో ప్రాక్టికాలిటీ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.
రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో మంత్రి పరిశీలించారు. కొండవీటి వాగు అభివృద్ధి పనులతో పాటు.. N9, N8, N7 రోడ్లపై ఈ వాగుపై నిర్మిస్తున్న ప్రధాన వంతెనల ప్రగతిని ఆయన సమీక్షించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, వంతెనల కింద నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డుకువలు లేకుండా నిలిచిపోయిన మట్టిని తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే అవసరమైన చోట్ల కొండవీటి వాగును మరింత వెడల్పు చేయాలని చెప్పారు. వీటితో పాటు నీరుకొండ వద్ద నిర్మిస్తున్న జలాశయం పనులను కూడా ఆయన పరిశీలించారు. భారీ వర్షాల వల్ల ఎలాంటి సవాళ్లు ఎదురైనా తట్టుకునేలా, నిర్దేశిత గడువులోగా రాజధాని పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.