'పెద్ది' ఈవెంట్‌లో కలకలం.. రామ్ చరణ్ అభిమాని అత్యుత్సాహంతో ఉలిక్కిపడిన జాన్వీ!

  • 'పెద్ది' సినిమా ప్రమోషన్స్‌లో నటి జాన్వీ కపూర్‌కు చేదు అనుభవం
  • రామ్ చరణ్‌ను కలిసేందుకు దూసుకొచ్చిన అభిమాని
  • బ్యాలెన్స్ కోల్పోయి జాన్వీ కూర్చున్న సోఫాపై పడటంతో భయప‌డ్డ న‌టి
  • వెంటనే స్పందించి అభిమానిని పక్కకు తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది
  • తర్వాత అదే అభిమానిని ప్రత్యేకంగా కలుసుకున్న రామ్ చరణ్
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ జంటగా నటించిన‌ చిత్రం 'పెద్ది'. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించడంతో నటి జాన్వీ కపూర్ భయంతో ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అస‌లేం జ‌రిగిందంటే..!
విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్, జాన్వీ వేదికపై పక్కపక్కనే కూర్చుని ఉండగా.. ఓ అభిమాని ఆయన్ను కలిసేందుకు వేదికపైకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయిన ఆ అభిమాని, జాన్వీ కూర్చున్న సోఫా హ్యాండిల్‌పై పడిపోయాడు. దీంతో ఆమె ఒక్కసారిగా భయపడిపోయింది. వెంటనే అప్రమత్తమైన రామ్ చరణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కెవిన్ కుంటా.. ఆ అభిమానిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ.. 'ఇంటర్నేషనల్ లెవెల్ సెక్యూరిటీ' అంటూ భద్రతా సిబ్బందిని ప్రశంసిస్తున్నారు.

అయితే, ఈవెంట్ ముగిసిన తర్వాత రామ్ చరణ్ అదే అభిమానిని ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. ఈ భేటీలో ఆ అభిమాని చరణ్‌కు కృతజ్ఞతలు చెప్పి, ఆయన పాదాలకు నమస్కరించాడు.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన‌ 'పెద్ది' చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా రేపు (జూన్ 4న) ప్రేక్షకుల ముందుకు రానుంది.


Jahnvi Kapoor
Ram Charan
fan
'Peddi' event
vijayawada
Tollywood

More Telugu News