తెలంగాణ‌లో పెరిగిన 'పెద్ది' టికెట్ ధరలు.. స్పెషల్ షో టికెట్ రేటు ఎంతంటే?

  • 'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
  • 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌పై రూ. 100, మల్టీప్లెక్స్‌లో రూ. 125 పెంపు
  • నేడు ప్రీమియర్ షోల టికెట్ ధర రూ. 600గా నిర్ణ‌యం
  • అదనపు ఆదాయంలో 20% సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయింపు
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన‌ భారీ బడ్జెట్ చిత్రం 'పెద్ది'కి తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చింది. సినిమా టికెట్ ధరలను తాత్కాలికంగా పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర హోం శాఖ అధికారికంగా జీవో (నెం. 7973) జారీ చేసింది. ఈ నిర్ణయంతో సినిమా విడుదలకు ముందు చిత్ర బృందానికి పెద్ద ప్రోత్సాహం లభించినట్లయింది.

ధరల వివరాలు ఇలా..
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రేపు(జూన్ 4న) ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రానికి 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. జూన్ 4 నుంచి 13వ తేదీ వరకు ఈ పెంపు అమల్లో ఉంటుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్‌పై అదనంగా రూ. 100, మల్టీప్లెక్స్‌లలో ప్రతి టికెట్‌పై రూ. 125 (జీఎస్‌టీతో కలిపి) పెంచుకోవచ్చు. ఈ పది రోజుల కాలపరిమితి ముగిసిన తర్వాత ధరలు తిరిగి సాధారణ స్థాయికి వస్తాయి. రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది.

రూ. 600తో ప్రత్యేక ప్రీమియర్ షోలు
అభిమానుల కోసం ఇవాళ‌ రాత్రి 8 గంటలకు ప్రత్యేక షోలు ప్రదర్శించనున్నారు. ఈ స్పెషల్ షో టికెట్ ధరను జీఎస్‌టీతో కలిపి రూ. 600గా నిర్ణయించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ రేట్ల పెంపునకు ఇదే విధమైన జీవో ఇవ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బుధవారం రాత్రి నుంచే 'పెద్ది' ప్రీమియర్ షోల సందడి ప్రారంభం కానుంది.

ఈ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని ఫిల్మ్ కార్మికుల సంక్షేమ నిధికి జమ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనడం ఒక ముఖ్యమైన అంశం. తాజా అనుమతులతో భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Peddi
Ticket Prices Hikes
Telangana Government
Ram Charan
Tollywood

More Telugu News