తెలంగాణలో చిచ్చుపెట్టొద్దు: పవన్‌పై అద్దంకి దయాకర్ ఫైర్

  • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే సభ ఎందుకని ప్రశ్న
  • రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారని దయాకర్ విమర్శ
  • పవన్ కల్యాణ్ వెనుక బీజేపీ ఉందని ఆరోపణ
  • తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పవన్‌కు హితవు
  • జనసేన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‍పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న హైదరాబాద్‌లో జనసేన పార్టీ కార్యక్రమం నిర్వహించాలన్న నిర్ణయంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య ద్వారా తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు అత్యంత పవిత్రమైన రోజున సభ పెట్టడం ద్వారా పవన్ కల్యాణ్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు. తెలంగాణ ప్రశాంతంగా ఉండటం పవన్‌కు ఇష్టం లేదా అని ఆయన ప్రశ్నించారు. జనసేన తలపెట్టిన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తర్వాత తెలంగాణను లక్ష్యంగా చేసుకునే బీజేపీ వ్యూహంలో భాగంగానే పవన్ ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ బీజేపీ, సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఆయనకు తెలంగాణపై మొదటి నుంచీ వ్యతిరేకత ఉందని విమర్శించారు. బీజేపీ విష కౌగిలిలో చిక్కుకోవద్దని పవన్‌కు హితవు పలికారు. నరనరాన తెలంగాణ వ్యతిరేకత నింపుకున్న వ్యక్తి ఇక్కడ రాజకీయం చేస్తామంటే ఊరుకుంటామా అన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో కూడా పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. తెలుగు ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. ఏపీలో పాలనపై దృష్టి పెట్టకుండా తెలంగాణ వ్యవహారాల్లో అనవసర జోక్యం చేసుకోవడం తగదని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున సభకు నిరాకరిస్తే, కనీసం ప్రెస్ మీట్‌కు అవకాశమివ్వాలని చెప్పడం విడ్డూరమని అన్నారు.  ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంటే బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

Addanki Dayakar fires at Pawan Kalyan
Pawan Kalyan Janasena
Addanki Dayakar on Janasena meeting

More Telugu News