"ధైర్యముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి".. ధర్నాకు అనుమతి నిరాకరణపై మమతా బెనర్జీ ఫైర్!

 Mamata Banerjee Challenges Police Over Dharna
  • కోల్‌కతాలో ధర్నాకు పిలుపునిచ్చిన మమతా బెనర్జీ
  • ధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు
  • అనుమతి ఇవ్వకపోయినా ధర్నా నిర్వహిస్తామన్న మమత

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కోల్‌కతాలో తాను చేపట్టబోయే ధర్నాను అడ్డుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ధైర్యముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అంటూ పోలీసులకు బహిరంగంగా సవాల్ విసిరారు. 


రాష్ట్రంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తదనంతర హింసకు వ్యతిరేకంగా, అలాగే తన మేనల్లుడు, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిని నిరసిస్తూ మమతా బెనర్జీ ఒక భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో దీదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా మేము కచ్చితంగా ధర్నా నిర్వహించి తీరుతాం. మీ చేతనైతే నన్ను అరెస్ట్ చేసుకోండి" అని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో మమతా బెనర్జీ స్పష్టం చేశారు.


బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితులు మరింత దిగజారాయని, ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య బతుకుతున్నారని ఆమె ఆరోపించారు. పోలీసులు కావాలనే తమ టీఎంసీ పార్టీని బలహీనపరిచేందుకు, దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవలి ఎన్నికల తర్వాత తమ పార్టీకి చెందిన దాదాపు 12 మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని, వేలాది మందిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. 


కొంతమంది నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడినా.. అది టీఎంసీని మరింత బలంగా పునర్నిర్మించడానికే ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. కోల్‌కతాలో శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తే.. ఈ పోరాటాన్ని దేశ రాజధాని ఢిల్లీకి సైతం తీసుకెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని మమతా బెనర్జీ హెచ్చరించారు.


Go Back to Shorts
Mamata Banerjee
TMC

More Telugu News