పారదర్శకతే లక్ష్యం.. టీజీపీఎస్సీలో కీలక సంస్కరణలు

  • టీజీపీఎస్సీలో ఇకపై అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగానే
  • ఓఎంఆర్ కంటే కంప్యూటర్ విధానమే అత్యంత సురక్షితం అన్న చైర్మన్
  • పరీక్షకు గంట ముందు కూడా ప్రశ్నపత్రం తయారు చేయవచ్చని వెల్లడి
  • పారదర్శకత కోసం ప్రతి 2-3 నెలలకు మీడియా సమావేశం ఏర్పాటు
  • అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని వ్యాఖ్య
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించే అన్ని నియామక పరీక్షలను ఇకపై కంప్యూటర్ ఆధారిత విధానంలోనే (సీబీటీ) నిర్వహిస్తామని చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా నియామక ప్రక్రియలో మరింత భద్రత, పారదర్శకత సాధ్యమవుతుందని అన్నారు.

సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "ప్రస్తుత పరిస్థితుల్లో నియామక పరీక్షల నిర్వహణకు కంప్యూటర్ ఆధారిత విధానమే అత్యుత్తమ మార్గం. సంప్రదాయ ఓఎంఆర్ విధానంతో పోలిస్తే ఇది ఎంతో సురక్షితమైనది. పరీక్షకు గంట ముందు కూడా ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేసే వెసులుబాటు ఉంటుంది" అని వివరించారు. కమిషన్‌లో అనేక సంస్కరణలు ప్రవేశపెడుతున్నామని, అభ్యర్థుల్లో విశ్వాసం నింపేందుకు సాంకేతికతను వాడుకుంటున్నామని తెలిపారు.

అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలివ్వడం సాధ్యం కాదని, అందుకే పోటీ పరీక్షల్లో కొందరికి నిరాశ తప్పదని ఆయన అన్నారు. కమిషన్‌పై వచ్చే నిరాధార విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పారదర్శకతను పెంచే ఉద్దేశంతో ఇకపై ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు.

Burra Venkatesham
TGPSC
Telangana Public Service Commission
CBT
Computer Based Test
Recruitment Exams

More Telugu News