పవన్ కల్యాణ్కు తెలంగాణతో ఏం పని?: అనిరుధ్ రెడ్డి
- పక్క రాష్ట్ర నేతలు తెలంగాణపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తే ఊరుకోబోమన్న అనిరుధ్ రెడ్డి
- ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన
- బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... అసలు పవన్ కల్యాణ్కు తెలంగాణతో ఏం పని? అంటూ సూటిగా ప్రశ్నించారు.
ఇటీవల పవన్ కల్యాణ్ తెలంగాణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, రాజకీయ కార్యకలాపాలను కాంగ్రెస్ నేత తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రాజకీయ పార్టీలు పెట్టుకునే, నడుపుకునే హక్కు ఉంటుందని అంగీకరిస్తూనే... పక్క రాష్ట్రాల నాయకులు వచ్చి తెలంగాణపై ద్వేషాన్ని, ప్రతికూలతను వ్యాప్తి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఇంకా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల విభజన అంశాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రధానంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో ఇంకా పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు తీవ్ర వివక్షకు, వేధింపులకు గురవుతున్నారని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. అదే సమయంలో తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఉద్యోగులు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నత స్థానాల్లో సౌకర్యవంతంగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. విభజన సమస్యల వల్ల ఏపీలో చిక్కుకుపోయిన తెలంగాణ ఉద్యోగులందరినీ తక్షణమే వెనక్కి రప్పించేలా తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్ నాయకులు నిరంతరం తెలంగాణను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నా, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుందో సమాధానం చెప్పాలని అనిరుధ్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో వారు నోరు మెదపడం లేదని విమర్శించారు.