ఎయిర్‌ట్రంక్‌కు ఆహ్వానం.. విశాఖలో మరో భారీ పెట్టుబడిపై లోకేష్ ఫోకస్

Nara Lokesh Focuses on Airtrunk Investment in Visakhapatnam
  • ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో మంత్రి నారా లోకేష్ భేటీ
  • విశాఖలో ఫ్యూచర్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఆహ్వానం
  • విశాఖను డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని వెల్లడి
  • ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించిన ఎయిర్‌ట్రంక్ సంస్థ
  • ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని సీఈఓ హామీ
ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా హైపర్‌స్కేల్ డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత సంస్థ ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో ముంబయిలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. విశాఖపట్నంలో 'ఎయిర్‌ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్'ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా లోకేష్ విజ్ఞప్తి చేశారు.

ఈ భేటీలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, "విశాఖపట్నం వేగంగా ఏఐ, డేటా హైపర్‌స్కేల్ హబ్‌గా ఆవిర్భవిస్తోంది. ఇప్పటికే గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, అదానీకనెక్స్ వంటి దిగ్గజ సంస్థల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ అన్ని విధాలా అనుకూలమైన నగరం. ఇక్కడ 6 గిగావాట్ల డేటా సెంటర్లను నెలకొల్పాలన్నది మా లక్ష్యం. మల్టీ-గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాలు, సంపూర్ణ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై మేం ప్రత్యేక దృష్టి సారించాం" అని వివరించారు. 

భారతదేశంలో మరే ఇతర ప్రాంతంలో లేని కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు ఏపీలో అందుబాటులో ఉన్నాయని, డేటా సెంటర్లకు అవసరమైన నిరంతర విద్యుత్ కోసం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు కూడా సిద్ధంగా ఉన్నాయని లోకేష్ తెలిపారు.

ఎయిర్‌ట్రంక్‌ను ఏపీకి తీసుకురావాలన్న ప్రయత్నాలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా తొలిసారి రాబిన్ ఖుదాతో సమావేశమై ఏపీ దార్శనికతను వివరించారు. ఆ తర్వాత ఎయిర్‌ట్రంక్ బృందం, ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చలు జరిపింది. అయితే, భారత్‌లో కార్యకలాపాలకు ఒక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేసుకున్న తర్వాతే విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో ఎయిర్‌ట్రంక్ తెలిపింది.

ఈ నేపథ్యంలో, ఎయిర్‌ట్రంక్ ఈ ఏడాది ఏప్రిల్‌లో అధికారికంగా భారతదేశంలోకి ప్రవేశించింది. బ్లాక్‌స్టోన్ మద్దతు ఉన్న డేటా సెంటర్ ప్లాట్‌ఫాం 'లుమినా క్లౌడ్‌ఇన్‌ఫ్రా'ను టేకోవర్ చేసింది. ఈ స్వాధీనంతో ముంబయి, చెన్నై, హైదరాబాద్‌లలో సుమారు 600 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు ఆ సంస్థ చేతికి వచ్చాయి. ఇది ఎయిర్‌ట్రంక్‌కు భారత్‌లో తక్షణ కార్యకలాపాలకు మార్గం సుగమం చేసింది. తమ ఆసియా పసిఫిక్ వ్యూహంలో భారత్‌ను ఒక ప్రధాన వృద్ధి మార్కెట్‌గా ఆ సంస్థ గుర్తించింది.

ఈ తాజా పరిణామాల నేపథ్యంలో, లోకేష్ మరోసారి రాబిన్ ఖుదాతో భేటీ అయి, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. దీనిపై రాబిన్ ఖుదా స్పందిస్తూ... ఎయిర్‌ట్రంక్ భారత ప్రణాళికలు, లుమినా క్లౌడ్‌ఇన్‌ఫ్రా ఏకీకరణ, భవిష్యత్ విస్తరణ రోడ్‌మ్యాప్ వంటి అంశాలను చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ భేటీతో విశాఖలో మరో భారీ పెట్టుబడికి మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Go Back to Shorts
Nara Lokesh
Airtrunk
Visakhapatnam
Andhra Pradesh
Data Centers
Robin Khuda
IT Investment
AI Hub
Lumina Cloudinfra
AP Investment

More Telugu News