'పెద్ది' చిత్రంపై ఎగ్జిబిటర్ల అల్టిమేటం.. బండ్ల గణేశ్ కీలక విజ్ఞప్తి

  • పర్సంటేజీ ప్రకారం అయితేనే సినిమాలు ప్రదర్శిస్తామన్న ఎగ్జిబిటర్లు
  • పెద్ది సినిమా విడుదల సమయంలో అందరూ ఏకతాటిపై నిలబడదామని బండ్ల గణేశ్ విజ్ఞప్తి
  • సినిమా బాగుంటేనే పరిశ్రమపై ఆధారపడిన వేలాది కుటుంబాలు బాగుంటాయని వ్యాఖ్య
  • ప్రస్తుతం పరిశ్రమకు బ్లాక్ బస్టర్ హిట్ అవసరమన్న బండ్ల గణేశ్
తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ ప్రకారం అయితేనే సినిమాలను ప్రదర్శిస్తామని నైజాం ఎగ్జిబిటర్లు అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ప్రముఖ నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా కీలక పోస్టు పెట్టారు. సినిమా పరిశ్రమ కష్టకాలంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, తెలుగు పరిశ్రమకు బ్లాక్ బస్టర్ హిట్ అవసరమని అభిప్రాయపడ్డారు. సినిమా బాగుంటేనే పరిశ్రమపై ఆధారపడిన వేలాది కుటుంబాలు బాగుంటాయని అన్నారు.

కాబట్టి 'పెద్ది' సినిమా విషయంలో పెద్ద మనసుతో సినిమా పరిశ్రమకు చెందిన వారమంతా ఏకతాటిపై నిలబడదామని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ పరిస్థితులు, థియేటర్ సమస్యలు తదితర అంశాలపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ విభేదాలు, వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి పరిశ్రమ బాగు కోసం ఆలోచన చేద్దామని కోరారు.

ఒక మంచి సినిమా బ్లాక్ బస్టర్ అయితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ కార్మికులందరికీ నమ్మకం వస్తుందని అన్నారు. కాబట్టి పర్సంటేజీ విషయమై అందరూ సామరస్యంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. కనీసం 'పెద్ది' చిత్రం విడుదల వరకైనా ఎవరు కూడా వివాదాలు, రాజకీయ అంశాల జోలికి వెళ్లకూడదని, ఈ చిత్రం సాఫీగా విడుదలయ్యేలా సహకరించాలని కోరారు.

Bandla Ganesh
Peddi Movie
Telugu Film Industry
Exhibitors
Single Screen Theaters
Movie Release

More Telugu News