మంత్రి లోకేశ్ గొప్ప మనసు.. 11 నెలల చిన్నారి వైద్యానికి భరోసా

  • కడప జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ మానవత్వం
  • అరుదైన వ్యాధితో బాధపడుతున్న 11 నెలల బాలుడికి అండ
  • చిన్నారి శ్రీవిష్ణు వైద్య ఖర్చులు తానే భరిస్తానని హామీ
  • ముద్దనూరులో మంత్రిని కలిసి గోడు వెళ్లబోసుకున్న తల్లిదండ్రులు
  • 'నేనున్నాను' అంటూ బాలుడిని ఎత్తుకొని భరోసా ఇచ్చిన లోకేశ్
వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ తన గొప్ప మనసును చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న 11 నెలల బాలుడికి మెరుగైన వైద్యం అందిస్తానని, ఆ ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే.. ముద్దనూరు మండలం యామవరం గ్రామానికి చెందిన సాయికుమార్, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమారుడు శ్రీవిష్ణు పుట్టినప్పటి నుంచి ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. బిడ్డను బతికించుకోవడం కోసం ఆ తల్లిదండ్రులు ప్రతి మూడు వారాలకు రూ. 16,000 ఖర్చు చేస్తూ వస్తున్నారు. ఇందుకోసం తమ వద్ద ఉన్న డబ్బు, బంగారు నగలు అమ్మి వైద్యం చేయిస్తున్నారు.

అయితే, మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ఓ ఆసుపత్రిని సంప్రదించగా, వైద్యానికి సుమారు రూ. 23 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. అంత పెద్ద మొత్తం భరించలేని స్థితిలో ఉన్న ఆ కుటుంబం, తమ గోడును విన్నవించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కొండాపురం మండలంలో అభివృద్ధి పనులకు వెళ్తున్న మంత్రి లోకేశ్‌ను ముద్దనూరులోని నాలుగు రోడ్ల కూడలి వద్ద బాలుడి తల్లిదండ్రులు కలిశారు.

వారి పరిస్థితిని చూసి చలించిపోయిన లోకేశ్, బాలుడిని ఎత్తుకొని ఆప్యాయంగా పలకరించారు. "నేను ఉన్నాను.. బాబు ఆరోగ్యం నేను చూసుకుంటాను" అని వారికి ధైర్యం చెప్పారు. మంత్రి ఇచ్చిన హామీతో ఆ తల్లిదండ్రుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. మంత్రికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

Nara Lokesh
Andhra Pradesh Minister
YS Kadapa District
Medical Assistance
Child Health
Rare Disease
Financial Support
Healthcare
Karnataka Bangalore

More Telugu News