భగీరథ్‌ను అప్పగించలేదు.. పోలీసులే అరెస్ట్ చేశారు: సీఎం రేవంత్ రెడ్డి

  • అప్పా జంక్షన్ తనిఖీల్లో బండి భగీరథ్ అరెస్ట్
  • లొంగిపోయారనే ప్రచారాన్ని ఖండించిన రేవంత్
  • పోలీసుల దర్యాప్తు సమాచారానికే ముఖ్యమంత్రి మద్దతు
  • మైనర్ బాలిక అంశంపై రాజకీయాలను తప్పుబట్టిన సీఎం
  • కేటీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను పోలీసులు చట్టప్రకారమే అరెస్ట్ చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అప్పా జంక్షన్ వద్ద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. తనకు పోలీసులు ఇచ్చిన సమాచారం ఇదేనని.. వారి మాటలనే తాను నమ్ముతానని పేర్కొన్నారు.

అది సరెండర్ ఎలా అవుతుంది?
బండి సంజయ్ తన కుమారుడిని పోలీసులకు అప్పగించారనే ప్రచారాన్ని ముఖ్యమంత్రి ఖండించారు. ఒకవేళ ఆయనే అప్పగించాలనుకుంటే పోలీసులను ఇంటికి పిలిచి అప్పగించాల్సిందని అభిప్రాయపడ్డారు. రోడ్డు మధ్యలో ఉన్న అప్పా జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకుంటే అది సరెండర్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. అప్పా జంక్షన్ ఏమైనా బండి సంజయ్ ఇల్లా? అని నిలదీశారు.

బాలిక విషయంలో రాజకీయం వద్దు
ఫిర్యాదు అందిన వెంటనే ప్రభుత్వం పద్ధతి ప్రకారం చర్యలు తీసుకుందని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ సున్నితమైన కేసులో బీఆర్ఎస్ నాయకులు సిగ్గు తప్పి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారే విచారణ జరిపి, వాళ్లే తీర్పులు ఇచ్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. పోక్సో కేసులో మైనర్ బాలిక వివరాలు వెల్లడిస్తే ఆ కుటుంబానికి ఎంతో ఇబ్బంది కలుగుతుందని, కేటీఆర్ రాజకీయాల కోసం ఒక బాలికను అడ్డుపెట్టుకోవడం సరికాదన్నారు.

Revanth Reddy
Bandi Bhagirath
Telangana
POCSO case
Appa Junction
Bandi Sanjay
KTR
BRS Leaders
Telangana Police

More Telugu News