సొంత నియోజకవర్గం కొడంగల్కు రేవంత్ మాస్టర్ ప్లాన్.. మారనున్న రూపురేఖలు
- కొడంగల్ను పారిశ్రామిక, విద్యా హబ్గా మార్చాలనేది రేవంత్ ప్లాన్
- 10 లైన్ల భారీ రేడియల్ రోడ్డుకు రూపకల్పన
- అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటయ్యే కంపెనీలకు అనుకూలం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ ముఖచిత్రాన్ని మార్చేందుకు ఒక ప్రతిష్ఠాత్మకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న రేడియల్ రోడ్ల నెట్వర్క్ను జిల్లాలకు విస్తరిస్తూ, కొడంగల్ను పారిశ్రామిక, విద్యా హబ్గా మార్చాలనేది సీఎం రేవంత్ రెడ్డి విజన్. ఇందులో భాగంగానే శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే 80 కిలోమీటర్ల భారీ దుద్యాల్ రేడియల్ రోడ్డుకు రూపకల్పన చేశారు. గతంలో కేవలం సిటీ ట్రాఫిక్ నియంత్రణకే పరిమితమైన రేడియల్ రోడ్లకు భిన్నంగా, దీనిని ఏకంగా 10 లైన్ల (300 అడుగుల) అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ కారిడార్గా మార్చాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ద్వారా లగచర్లలో ప్రతిపాదించిన 2000-3000 ఎకరాల పారిశ్రామిక వాడ, హకీంపేట్లో రాబోయే అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్లను కలుపుతూ హై-స్పీడ్ నెట్వర్క్ ఏర్పడనుంది. 10 లైన్ల వెడల్పుతో, ఎక్కడా సిగ్నల్స్ లేకుండా సాగే ఈ రోడ్డు వల్ల గంటన్నర ప్రయాణ సమయం కేవలం 45 నిమిషాలకు తగ్గుతుంది. భవిష్యత్తులో రాబోయే రీజినల్ రింగ్ రోడ్ (RRR)ను కూడా ఇది కలుపుతుంది. భారీ రవాణా వాహనాలకు, సాధారణ ప్రయాణికులకు విడివిడిగా సురక్షితమైన లైన్లు, సర్వీస్ రోడ్లు, రోడ్డు ఇరువైపులా గ్రీన్ బెల్ట్ ఉండేలా దీనిని ప్లాన్ చేశారు.
ముఖ్యంగా దుద్యాల్ మండల పరిధిలో ప్రభుత్వం ప్రతిపాదించిన 'ఫార్మా విలేజ్'కు ఈ రోడ్డే వెన్నెముకగా మారబోతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటయ్యే కంపెనీలకు రవాణా పరంగా ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల దుద్యాల్ మండలం హైదరాబాద్ నగరానికి ఒక అందమైన 'శాటిలైట్ సిటీ' గా రూపాంతరం చెందడమే కాకుండా, స్థానిక యువతకు సొంత నియోజకవర్గంలోనే ఐటీ, ఫార్మా రంగాల్లో ఉపాధి లభిస్తుంది. అంతేకాకుండా, రోడ్డు పొడవునా వాణిజ్య కేంద్రాలు రానుండడంతో భూముల ధరలకు మంచి డిమాండ్ ఏర్పడి, స్థానిక రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది.