పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నానంటే?: టీఎంసీ నేత జహంగీర్ ఖాన్

  • ఫాల్తా ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్
  • ఫాల్తా అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వెల్లడి
  • అందుకే తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు వెల్లడి
తృణమూల్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ మంగళవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఫాల్తా ఉపఎన్నికలో పోటీ చేయబోనని ప్రకటించారు. రీపోలింగ్‌కు రెండు రోజుల ముందు ఈ ప్రకటన వెలువడింది. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మే 24వ తేదీన జరగనుంది. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 సీట్లను గెలుచుకుని భారీ విజయం సాధించింది. సువేందు అధికారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఫాల్తా నియోజకవర్గం నుంచి తాను ఎందుకు పోటీ నుంచి తప్పుకున్నానో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ప్రకటన విడుదల చేశారు. తాను ఫాల్తా నియోజకవర్గం బిడ్డనని, ఈ ప్రాంతమంతా శాంతియుతంగా ఉండి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఫాల్తా అభివృద్ధికి ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రత్యేక ప్యాకేజీని ఇస్తానని హామీ ఇచ్చారని అన్నారు. అందుకే తాను పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి, శాంతి ప్రయోజనాల కోసం తాను పోటీ నుంచి తప్పుకున్నానని అన్నారు.

మే 21న జరిగే ఎన్నికల్లో బీజేపీ తరఫున దేబాంగ్షు పాండా, కాంగ్రెస్ తరఫున అబ్దుర్ రజాక్ మొల్లా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తరఫున శంభు నాథ్ కుర్మి పోటీ చేస్తున్నారు. 

వ్యక్తిగత నిర్ణయం

ఫాల్తా బరి నుంచి తప్పుకోవడం పార్టీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ సొంత నిర్ణయమని టీఎంసీ ప్రకటించింది. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి, ఒక్క ఫాల్తాలోనే తమ పార్టీకి చెందిన 100 మంది కార్యకర్తలు అరెస్టయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. అధికార పార్టీ బెదిరింపులపై పదేపదే ఫిర్యాదు చేస్తున్నప్పటికీ, ఈసీ చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించింది. బీజేపీ బెదిరింపులను తాము ప్రతిఘటిస్తూనే ఉంటామని పార్టీ తెలిపింది.

Jahangir Khan
TMC
Trinamool Congress
West Bengal Elections
Falta byelection
Suvendu Adhikari

More Telugu News