భోగాపురం ఎయిర్ పోర్టు పనులను తక్షణమే ఆపండి: విష్ణుకుమార్ రాజు
- ఇంధన సంక్షోభం వల్ల సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విష్ణుకుమార్ రాజు
- ఇంధన సంక్షోభం ముగిసే వరకు భోగాపురం పనులు ఆపాలని డిమాండ్
- ప్రజలకు ఇంధనం అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ ప్రాధాన్యత కావాలని సూచన
రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన సంక్షోభం వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలు చేశారు.
ప్రస్తుత ఇంధన సంక్షోభం పరిష్కారమయ్యే వరకు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. విమానాశ్రయం కంటే ప్రజల దైనందిన అవసరాలకు ఇంధనం అందుబాటులో ఉండటమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత కావాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్టును యథాతథంగా కొనసాగించాలని, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.
డీజిల్ డిమాండ్ను తగ్గించేందుకు ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఇంధన వినియోగాన్ని ఆదా చేసేందుకు డీజిల్ బస్సుల స్థానంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజా రవాణాను బలోపేతం చేయడం ద్వారానే ఇంధన సంక్షోభాన్ని అధిగమించవచ్చని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం నుంచి కీలక నగరాలైన విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, చెన్నైలకు కొత్తగా వందేభారత్ రైళ్లను వెంటనే ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. రైలు సర్వీసులను పెంచడం వల్ల వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గి, ఇంధన భారం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.