విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఘోరం... కుక్క నోట మనిషి కాలు!

  • రోగి కాలుకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో తొలగింపు
  • బయోవేస్ట్‌లో తరలించేందుకు సంచిలో పెట్టి వ్యర్థాల గదిలో ఉంచిన సిబ్బంది
  • తొలగించిన కాలును నోట కరుచుకు వెళ్లిన కుక్క
విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తికి ఇన్‌ఫెక్షన్ సోకి తొలగించిన కాలును ఒక కుక్క నోట కరుచుకు వెళ్ళింది. వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు, ఒక రోగికి ఇన్‌ఫెక్షన్ సోకడంతో కాలును తొలగించారు. తొలగించిన కాలును బయో వేస్ట్‌లో భాగంగా తరలించేందుకు ఒక సంచిలో పెట్టి ఆసుపత్రి మొదటి అంతస్తులోని వ్యర్థాల గదిలో ఉంచారు.

బయోవేస్ట్‌ను తరలించే 'సేఫ్' వాహనం, మున్సిపల్ కార్పొరేషన్ వాహనాలు మూడు రోజులకు ఒకసారి వస్తాయి. దీంతో తొలగించిన కాలును వ్యర్థాల గదిలో ఉంచారు. ఈ గదిలో భద్రతా ప్రామాణాలు పాటించకపోవడంతో ఒక కుక్క కాలును నోట కరుచుకు వెళ్ళింది. తలుపులు సరిగా మూసి ఉంచకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.

ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించిన ఒక కుక్క నేరుగా మొదటి అంతస్తులోని వ్యర్థాల గదిలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న సంచిని నోట కరిచి బయటకు పరుగు తీసింది. ఆసుపత్రి వెలుపల కొంతదూరంలో కుక్క ఆ కాలులో కొంత భాగాన్ని పీక్కుని తిన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు ఆసుపత్రి సిబ్బంది, భద్రతా సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఘటన వెలుగులోకి రావడంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే కుక్కను వెంబడించి దూరంగా పడేసిన కాలి భాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

Guntur GGH
Guntur Government General Hospital
Vijayawada
Hospital Negligence
Infection

More Telugu News