ఉత్తరాది, దక్షిణాది అంటూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు కాలం చెల్లింది: బండి సంజయ్
- ఎన్నికల ఫలితాలు రేవంత్, స్టాలిన్ కు చెంపపెట్టు అన్న బండి సంజయ్
- రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు రాబోతున్నాయని ధీమా
- పీఎంజే జ్యువెలరీ దుకాణంలో కాల్పుల ఘటనను ఖండించిన కేంద్ర మంత్రి
దేశ రాజకీయాల్లో విభజన రేఖలు గీసే ప్రయత్నం చేస్తున్న వారికి ప్రస్తుత ఎన్నికల ఫలితాలు సరైన గుణపాఠమని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ దుకాణంలో జరిగిన దోపిడీ ప్రయత్నం, కాల్పుల ఘటనలో గాయపడిన వారిని ఆయన పరామర్శించారు.
ఉత్తరాది, దక్షిణాది అంటూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు కాలం చెల్లిందని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్లకు ఈ ఫలితాలు ఒక చెంపపెట్టు వంటివని అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్లు రాబోతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పీఎంజే జ్యువెలరీ దుకాణంలో జరిగిన కాల్పుల ఘటనను ఆయన ఖండించారు. గాయపడిన సిబ్బంది ధైర్యాన్ని మెచ్చుకుంటూ, వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని యాజమాన్యాన్ని కోరారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధితులకు ధైర్యం చెప్పాల్సింది పోయి, ఇలాంటి సున్నితమైన అంశాలను కూడా కొందరు రాజకీయ కోణంలో చూడటం దురదృష్టకరమని మండిపడ్డారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారని, దోషులు తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు.