నందిగ్రామ్ సీన్ రిపీట్?.. భవానీపూర్‌లోనూ మమతపై సువేందు ముందంజ

  • భవానీపూర్ నియోజకవర్గంలో వెనుకబడిన సీఎం మమతా బెనర్జీ
  • ఆమెపై ఆధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి
  • రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీని వెనక్కి నెట్టి ముందంజలో బీజేపీ
  • గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతను ఓడించిన సువేందు అధికారి
  • ఈసారి నందిగ్రామ్‌లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్న సువేందు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కీలకమైన భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి, ఒకప్పటి ఆమె సన్నిహితుడు సువేందు అధికారి ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగానూ తొలి రౌండ్లలో బీజేపీ హవా కనిపిస్తోంది. ఉదయం 9.20 గంటల సమయానికి బీజేపీ 154 స్థానాల్లో, తృణమూల్ కాంగ్రెస్ 107 సీట్లలో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

గత ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానంలో సువేందు అధికారి చేతిలో మమత ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కేవలం 2,000 ఓట్ల కంటే తక్కువ తేడాతో ఓడిపోవడంతో ముఖ్యమంత్రిగా తన పదవిని నిలబెట్టుకోవడం కోసం ఆమె భవానీపూర్ నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి కూడా సువేందు.. మమతను లక్ష్యంగా చేసుకున్నారు. తన కంచుకోట అయిన నందిగ్రామ్‌తో పాటు భవానీపూర్‌లోనూ పోటీకి దిగారు. ప్రస్తుతం ఆయన నందిగ్రామ్‌లోనూ ఆధిక్యంలో కొనసాగుతుండటం గమనార్హం.

కోల్‌కతా జిల్లా పరిధిలోని భవానీపూర్ 2011 నుంచి తృణమూల్ కంచుకోటగా ఉంది. గతంలో మమత కూడా ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకోవడానికి ఇదే స్థానం నుంచి ఉప ఎన్నికలో గెలిచారు. బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. 2021 ఎన్నికల్లో 294 స్థానాలకు గాను 215 సీట్లు గెలిచి టీఎంసీ ఘన విజయం సాధించగా తాజా ట్రెండ్స్ భిన్నమైన రాజకీయ సమీకరణాలకు సంకేతమిస్తున్నాయి.

Mamata Banerjee
Bhabanipur
Suvendu Adhikari
West Bengal Elections
TMC
BJP
Nandigram
Election Results
West Bengal Politics
Assembly Elections

More Telugu News