యోగా చేస్తే జగన్ కు మానసిక బాధ తగ్గుతుంది: మంత్రి వాసంశెట్టి సెటైర్లు!
- రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారన్న వాసంశెట్టి
- వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా జగన్ తీరు మారలేదని విమర్శ
- ఇప్పుడు పెట్టుబడులు వస్తుంటే ఆ క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకోవడానికి యత్నిస్తున్నారని మండిపాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న కొత్త పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధిని చూసి వైసీపీ అధినేత జగన్ తట్టుకోలేకపోతున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు జరిగిన 'చీకటి పాలన'ను ప్రజలు తిరస్కరించి, వారిని 11 సీట్లకే పరిమితం చేసినా జగన్ తీరు మారలేదని ఆయన విమర్శించారు.
ఏపీకి రాజధాని లేకుండా చేయడంతో పాటు, అన్ని రంగాలను నాశనం చేసిన ఏకైక వ్యక్తి జగన్ అని, ఆ 'క్రెడిట్' ఆయనకే దక్కుతుందని మంత్రి ఎద్దేవా చేశారు. జగన్ అనుసరించిన వేధింపుల విధానం వల్ల సుమారు 40కి పైగా ప్రముఖ కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి పారిపోయాయని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే, ఆ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని, ఆయనో 'క్రెడిట్ చోర్' అని ధ్వజమెత్తారు. తన మానసిక ఆందోళనను, బాధను తగ్గించుకోవడానికి జగన్ యోగా వంటి కార్యక్రమాలు చేయాలని, అప్పుడు ఆయనకు నిజాలు మాట్లాడే శక్తి వస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.