విశాఖలో అట్టహాసంగా ఏయూ శతాబ్ది ఉత్సవాలు.. ప్రముఖులతో వెలిగిపోయిన వేదిక

Andhra University Centenary Celebrations
  • విశాఖలో ఘనంగా ప్రారంభమైన ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుక 
  • ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి.. హాజరైన సీఎం చంద్రబాబు
  • పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, గవర్నర్లు, ప్రజాప్రతినిధుల హాజరు
  • వేడుకల్లో పాల్గొన్న క్రికెట్ దిగ్గజం సచిన్, ఏయూ పూర్వ విద్యార్థి, సినీ దర్శకుడు త్రివిక్రమ్ 
  • 25 వేల మందికి పైగా విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో నిండిన ప్రాంగణం
శత వసంతాల చారిత్రక ప్రస్థానానికి గుర్తుగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం సోమవారం విశాఖపట్నంలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దేశానికి ఎందరో మేధావులను, రాజకీయ ప్రముఖులను, ఉన్నతాధికారులను అందించిన ఈ సరస్వతీ నిలయం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికైంది. విద్యార్థులు, పూర్వ విద్యార్థుల కేరింతలతో ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది.

ఈ చారిత్రక ఘట్టానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు  ఒడిశా గవర్నర్ కె. హరిబాబు, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి, ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల ఘనతకు గుర్తుగా ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. వర్సిటీ అభివృద్ధి పనులను కూడా ఇదే వేదిక నుంచి ప్రారంభించారు.

పరిశోధనలకు ఆయువుపట్టుగా, ఎన్నో ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఘన చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల కోసం సుమారు 25 వేల మందికి పైగా ప్రస్తుత, పూర్వ విద్యార్థులు తరలివచ్చారు. వారి కోసం మూడు భారీ జర్మన్ షెడ్లను ఏర్పాటు చేసి, 36 విభాగాలుగా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్లు, ఆకర్షణీయమైన అలంకరణలతో ప్రాంగణం కొత్త కాంతులతో వెలిగిపోయింది. ఈ శతాబ్ది ఉత్సవాలు విశ్వవిద్యాలయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోనున్నాయి.
Go Back to Shorts
Andhra University
Centenary Celebrations
Vizag
Andhra Pradesh

More Telugu News